(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
హైదరాబాద్ : తెలుగు చిత్రసీమలో విషాదం చోటుచేసుకుంది. సీనియర్ జర్నలిస్ట్, సినీ పీఆర్ఓ పసుపులేటి రామారావు మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ ఉదయం కన్నుమూశారు. సినీ పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవికి పసుపులేటి రామారావు ఎంతో ఆప్తుడు.
పసుపులేటి రామారావు స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు. డ్రిగీ వరకు చదువుకున్న ఆయన ప్రజా నాట్యమండలి, కమ్యూనిస్టు పార్టీలో చురుగ్గా పనిచేశారు. మొదట విశాలాంధ్ర, తర్వాత జ్యోతిచిత్ర పత్రికల్లో జర్నలిస్ట్గా పనిచేసారు. ప్రస్తుతం సంతోషం సినీ పత్రిక తరపున పనిచేస్తున్నారు. ఎన్ టి ఆర్, ఎ ఎన్ ఆర్, జగ్గయ్య, కృష్ణ, కృష్ణంరాజు, శోభన్బాబు, చంద్రమొహన్, మురళీ మోహన్, మోహన్బాబు, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, ఇప్పటి తరం హీరోలు, హీరోయిన్లు, నిర్మాతలతో పాటు సాంకేతిక నిపుణులను పసుపులేటి ఇంటర్వ్యూలు చేశారు. వీటిలో ఎంపిక చేసిన కొన్నింటిని నాటి మేటి సినీ ఆణిముత్యాలు అనే పేరుతో పుస్తక రూపంలో తీసుకువచ్చారు. పసుపులేటి రామారావు మరణం పట్ల తెలుగు సినిమా ప్రముఖులు సంతాపం తెలిపారు.
పసుపులేటి రామారావు మృతి పట్ల చిరంజీవి తీవ్ర దిగ్ర్భాంతిని వ్యక్తం చేశారు. రామారావు తనకు ఆత్మబంధువనీ, సీనియర్ జర్నలిస్టు అనే కాకుండా ఆయన వ్యక్తిత్వం తనకెంతో ఇష్టమనీ అన్నారు. ‘ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారని, నడవలేకపోతున్నారని తెలిసి సన్ షైన్ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ గురవారెడ్డి దగ్గరికి పంపించాను. మోకాళ్ల ఆపరేషన్ చేయించుకోవాలన్నారు. తన అక్కయ్య గారికి బాగోలేదని, ఆమె కోలుకున్నాక ఆపరేషన్ చేయించుకుంటానని రామారావు అన్నారు. నేనంటే ఆయనకు ఎంతో అభిమానం, అతనన్నా నాకంతే అభిమానం. లేకలేక పుట్టిన అతని కుమారుడికి మా ముగ్గురు అన్నదమ్ముల పేర్లు కలిసి వచ్చేలా పేరు పెట్టాడు. ఆ కుర్రాడి పేరు చిరంజీవి నాగ పవన్ అనుకుంటాను. నేనతన్ని కేవలం ఒక జర్నలిస్టుగానే చూడను. నీతికి నిజాయితీకీ నిబద్దతకూ మరో రూపంలా చూస్తుంటాను. అతని కుటుంబానికి నేను అన్ని రకాలుగా అండగా ఉంటాను, వాళ్ల కుటుంబం బాగోగులను చూసుకుంటాను ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి’ అంటూ చిరంజీవి తన సంతాపాన్ని తెలియచేశారు.
Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!