సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ నూతలపాటి వెంకట రమణ (ఎన్వీ రమణ)కి ఆచార్య నాగార్జున యూనివర్శిటీ గౌరవ డాక్టరేట్ ప్రధానం చేసింది. వర్శిటీలో జరిగిన 37,38 వ స్నాతకోత్సవాలకు ముఖ్య అతిధిగా విచ్చేసిన జస్టిస్ ఎన్వీ రమణను గౌరవ డాక్టరేట్ తో యూనివర్శిటీ సత్కరించింది. అనంతరం విద్యార్ధులకు సీజేఐ పట్టాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా సీజేఐ డాక్టర్ ఎన్వీ రమణ మాట్లాడుతూ.. డాక్టరేట్ ఇచ్చి గౌరవించిన వర్శిటీకి సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ధన్యవాదాలు తెలియజేస్తూ .. ఈ యూనివర్శిటీకి గొప్ప చరిత్ర ఉందన్నారు. ఈ వర్శిటీ నుండి వెళ్లిన చాలా మంది వివిధ హోదాల్లో ఉన్నారనీ, తాను ఈ యూనివర్శిటీ పూర్వ విద్యార్ధినేనని పేర్కొన్నారు.
యూనివర్శిటీతో తనకు ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయని గుర్తు చేసుకున్నారు సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ. యూనివర్శిటీ లో తాము చదువుకున్న సమయంలో ఇన్ని గదులు కూడా లేవని అన్నారు. తాము విద్యనభ్య సించిన సమయంలో సమాజంలోని అనేక విషయాలపై చర్చలు జరిగేవనీ, ఇప్పుడు అలాంటి చర్చలు విద్యార్ధులు జరుపుతున్నట్లు కనిపించడం లేదని తెలిపారు. విద్యార్ధులు సమస్యలపై అవగాహన కల్గి ఉండటంతో పాటు వాటి పరిష్కారాలను చూపగలగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, వీసీ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
తొలుత రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన విందు కార్యక్రమంలో సీజేఐ ఎన్వీ రమణ పాల్గొన్నారు. మంగళగిరి సీకే కన్వెన్షన్ సెంటర్ నందు సీజేఐ ఎన్ వీ రమణ, ఏపి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ల గౌరవార్ధం రాష్ట్ర ప్రభుత్వం అధికారిక విందు ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి సీఎం వైఎస్ జగన్, భారతి దంపతులు హజరైయ్యారు. కార్యక్రమంలో ఏపి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రశాంత్ కుమార్, మిశ్ర, పలువురు న్యాయమూర్తులు పాల్గొన్నారు.