సుప్రీం కోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నియమితులయ్యే అవకాశం ఉంది. ఈ మేరకు జస్టిస్ చంద్రచూడ్ పేరును ప్రతిపాదిస్తూ ప్రస్తుత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యూయు లలిత్ కేంద్రానికి సిఫార్సు చేశారు. సీజేఐ జస్టిస్ యుయు లలిత్ నవంబర్ 8 వ తేదీన పదవీ విరమణ అవుతున్న నేపథ్యంలో తదుపరి ప్రధాన న్యాయమూర్తి ఎంపిక ప్రక్రియ ప్రారంభం అయ్యింది.
ప్రస్తుతం సుప్రీం కోర్టులో సీనియర్ న్యాయమూర్తి గా ఉన్న జస్టిస్ చంద్రచూడ్ సుప్రీం కోర్టు 50వ సీజే గా బాధ్యతలు చేపట్టనున్నారు. తుదపరి సీజే ఎంపికపై ప్రతిపాదన పంపాలని ఈ నెల 7వ తేదీనే కేంద్ర న్యాయశాఖ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యూయు లలిత్ లేఖ పంపింది. ఈ నేపథ్యంలో సీజే జస్టిస్ లలిత్ కేంద్రానికి తదుపరి సీజే పోస్టునకు జస్టిస్ చంద్రచూడ్ పేరును పంపారు. సీజే జస్టిస్ యూయూ లలిత్ ఈ ఏడాది ఆగస్టు నెలలో బాధ్యతలు చేపట్టారు. ఆయన కేవలం 74 రోజులు మాత్రమే సీజేగా సేవలు అందించి నవంబర్ 8వ తేదీన రిటైర్ అవ్వనున్నారు. జస్టిస్ చంద్రచూడ్ దాదాపు రెండు సంవత్సరాల పాటు అంటే 2024 నవంబర్ 10 వ తేదీ వరకూ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సేవలు అందించనున్నారు.
సుప్రీం కోర్టులో ఖాళీగా ఉన్న ఇద్దరు న్యాయమూర్తుల ఖాళీల భర్తీకి సీజే జస్టిస్ యూయూ లలిత్ నేతృత్వం కోలీజియం సమావేశం నిర్వహించలేకపోయారు. కోలీజియంలో ఉన్న ఇద్దరు సీనియర్ న్యాయమూర్తులు అభ్యంతరం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఆ ప్రతిపాదనను విరమించుకున్నారు. సుప్రీం కోర్టులో ఖాళీగా ఉన్న ఇద్దరు న్యాయమూర్తుల ఎంపిక ప్రక్రియ జస్టిస్ చంద్రచూడ్ సీజేగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జరగనున్నది.