తమిళ సూపర్ స్టార్ తలైవా.. మరోసారి అభిమానుల్ని నిరాశ పరిచారు. కనీసం ఈ సారైన తమ అభిమాన నాయకుడి పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ వస్తుందనుకున్న సమయంలో… తలైవా రజనీకాంత్ ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో రజనీ అభిమానులకు మరోసారి నిరాశ తప్పలేదు.
తమిళనాడులో శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తన అభిమాన సంఘాలైన రజనీ మక్కళ్ మండ్రం-ఆర్ఎంఎం నిర్వాహకులతో రజనీకాంత్ సమావేశమయ్యారు. స్థానిక రాఘవేంద్ర కళ్యాణమండపంలో మక్కళ్ మండ్రం 30 జిల్లాల కార్యదర్శకులతో భేటీ అయ్యారు. రాజకీయ అరంగేట్రం గురించి చర్చించడానికే ఈ సమావేశం ఏర్పాటు చేశారనే అభిప్రాయాలు వినిపించాయి. 35 నిమిషాలకుపైగా జరిగిన సమావేశం తర్వాత.. రజనీ ఎలాంటి ప్రకటన చేయలేదు.శాసనసభ ఎన్నికలకు సన్నాహాలు మొదలుపెట్టిన అధికార, ప్రతిపక్షాలు ఈ సమావేశంపై దృష్టి పెట్టాయి. సరికొత్త అంచనాలు, విశ్లేషణలు మళ్లీ తెరపైకి వచ్చాయి.
రజనీకాంత్ రాజకీయ ప్రవేశంపై చాలా ఏళ్లుగా చర్చ జరుగుతూనే ఉంది. మూడేళ్ల క్రితం రజనీ ఆ ఉత్కంఠకు తెరదించారు. రాజకీయాల్లోకి వస్తానంటూ ప్రకటించినా.. పార్టీ ప్రారంభించలేదు. క్రియాశీలక రాజకీయాలకు దూరంగానే ఉంటున్నారు.తాజాగా.. అభిమాన సంఘాల నిర్వాహకులతో..రజనీ నిర్వహించిన సమావేశం.. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కనీసం ఈసారైనా తలైవా ప్రకట చేస్తారని అంతా భావించారు. కానీ … సమావేశం ముగిశాక రజనీ కాంత్ ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో… అభిమానులంతా నీరసించారు. మీటింగ్ అయిపోయాక రజనీ హడావుడిగా ఇంటికి వెళ్లిపోయారు.
అభిమానులను సముదాయించలేక రజనీకాంత్ సిబ్బంది ఇబ్బంది పడాల్సి వచ్చింది..రజనీ రాజకీయ ప్రవేశంపై ఇప్పటికే పలుమార్లు ప్రచారం జరిగింది. ప్రస్తుతం ఆయన పుట్టినరోజు డిసెంబరు 12న ప్రకటన వెలువడొచ్చనే ప్రచారం ఊపందుకుంది. అంతలో మక్కళ్ మండ్రం జిల్లా కార్యదర్శులతో ఈరోజు సమావేశం కావడం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే.. అభిమానుల సంఘాల సమావేశంపై సర్వత్రా ఉత్కంఠత రేపినప్పటికీ.. రజనీ నుంచి పొలిటికల్ ఎంట్రీపై ఎలాంటి ప్రకటన రాకపోవడంతో.. తలైవా ఫ్యాన్స్ మరోసారి నిరాశకు గురయ్యారు.