పార్టీ ఫిరాయించిన శాసనసభ్యులను అనర్హులుగా ప్రకటించే అధికారం స్పీకర్దేనని ఈ విషయంలో తాము జోక్యం చేసుకోలేమని పలు రాష్ట్రాల హైకోర్టులో అనేక సందర్భాల్లో ప్రకటించాయి.
అయితే ఇందుకు భిన్నంగా రాజస్థాన్ హైకోర్టు ఈ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంది.దీంతో రాజస్థాన్ అసెంబ్లీ స్పీకర్ నేరుగా సుప్రీం కోర్టు తలుపు తట్టారు.సుప్రీం కోర్టు ఈ విషయంలో ఇచ్చే తీర్పు దేశం మొత్తానికి లాండ్ మార్క్ జడ్జిమెంటు కాగలదని న్యాయనిపుణులు చెబుతున్నారు.
రాజస్థాన్ లో రాజకీయం ఇప్పట్లో ఒక కొలిక్కి వచ్చేలా కనిపించడం లేదు. మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ తిరుగుబాటుతో రాజస్థాన్ కాంగ్రెస్ లో చెలరేగిన తుఫాన్ ఇప్పట్లో సమసిపోయేలా లేదు.కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడానికి సచిన్ పైలెట్ అయన వర్గీయులైన ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయగా వారిని స్పీకర్ అనర్హులుగా ప్రకటించడం తెలిసిందే.దీంతో సచిన్ పైలెట్ హైకోర్టు కెళ్లారు. హైకోర్టులో ప్రభుత్వానికి ప్రతికూల ఫలితమే వచ్చింది. ఈ నెల ఇరవై నాలుగో తేదీ వరకు మాజీ డిప్యూటీ సీఎం సచిన్ ,ఆయన వర్గీయులైన ఎమ్మెల్యేలపై ఎలాంటి చర్యలను తీసుకోకూడదంటూ హైకోర్టు ఆదేశించింది.
హైకోర్టు తీర్పు పై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంలో తేల్చుకోవడానికి రాజస్థాన్ ప్రభుత్వం సిద్ధమైంది. హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ అసెంబ్లీ స్పీకర్ సీపీ జోషీ.. ఈ రోజు మధ్యాహ్నం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటీషన్ ను దాఖలు చేశారు. స్పీకర్ తరఫున ప్రముఖ న్యాయవాది ఈ పిటీషన్ ను దాఖలు చేసారు. ఈ సందర్భంగా సీపీ జోషీ జైపూర్ లో మీడియాతో మాట్లాడుతూ .. ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసే సర్వహక్కులు స్పీకర్కు ఉన్నాయని దీన్ని న్యాయస్థానాలు ప్రశ్నించలేవని అన్నారు. రాజ్యంగానికి చట్టసభ రూల్స్ ప్రకారమే తాము శాసనసభ్యులపై అనర్హత వేటు వేస్తామని దీనిపై హైకోర్టు స్టే ఇవ్వడం సరైనది కాదని చెప్పుకొచ్చారు.
కాగా స్పీకర్.. సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో రాజస్థాన్ లో రాజకీయం మంచి రసపట్టుగా సాగుతోంది.మరి హైకోర్టు ఆదేశాలను సుప్రీంకోర్టు సమర్థిస్తుందో .. లేదో చూడాలి.అయితే సుప్రీం కోర్టు ఏ తీర్పు ఇచ్చినప్పటికీ దాని కారణంగా పార్టీ ఫిరాయింపుదారుల విషయంలో స్పీకర్ల కున్న అధికారాల మీద స్పష్టమైన క్లారిటీ రాగలదని న్యాయ నిపుణులు భావిస్తున్నారు. ఇది దేశం మొత్తానికి కూడా వర్తించగలదని అంటున్నారు.