అనుకున్నదే అయింది… జనసేనుడు మరోసారి వెనకడుగు వేశాడు.. తిరుపతి ఉప ఎన్నికల్లో ఇప్పటివరకు ఖరారు కాని బిజెపి జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి పై దాదాపు ఇరు పార్టీలకు ఓ క్లారిటీ వచ్చినట్లు కనిపిస్తోంది. దీన్ని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చెప్పకనే చెప్పేశారు. తిరుపతి ఉప ఎన్నికల్లో భాజపా తరఫున నిలబడే అభ్యర్థికి జనసేన కార్యకర్తలు అండగా నిలవాలని అంటూ తిరుపతి భాజపా పదాధికారుల సమావేశం సాక్షిగా సోము ప్రకటించడం రాజకీయ వర్గాల్లో ముఖ్యంగా భాజపా జనసేన నాయకుల్లో చర్చనీయాంశం అయింది.
ఎన్ని అడుగులు వెనక్కు వేస్తారు??
జనసేన పార్టీ బీజేపీ కు మిత్రపక్షంగా జతకట్టిన తర్వాత నుంచి పలు ఎన్నికల్లో భాజపా తన ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో భాజపా ఒంటరిపోరుకు జనసేన సహకరించింది. అలాగే పో తిరుపతి ఉప ఎన్నికల్లో సైతం భారతీయ జనతా పార్టీ తరఫున రంగంలోకి దిగి బోయే అభ్యర్థికి జనసేన మద్దతు ఇవ్వబోతుందని, ఇటీవల తిరుపతి పర్యటనకు వచ్చిన జనసేనాని పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కార్యకర్తలతో నాయకులతో సమావేశం సందర్భంగా తిరుపతి లోక్సభ నియోజకవర్గం పరిధిలో పార్టీ బలాన్ని పరిశీలించి అవాక్కయ్యారని, కనీసం కొన్ని నియోజకవర్గాల్లో నాయకులే కరువయ్యారని దీంతో జనసేన పార్టీ తరఫున ఉప ఎన్నికల్లో ఉంచడం వల్ల ఒరిగేదేమీ లేదని తేలడంతో పవన్ మౌనం దాల్చి ఆ కార్యకర్తల సమావేశాన్ని ముగించారు అని “న్యూస్ ఆర్బిట్ ” ముందే చెప్పింది. అన్యమనస్కంగానే ఆ కార్యకర్తల సమావేశాన్ని ముగించిన పవన్ తిరుపతి ఉప ఎన్నికలలో భాజపా అభ్యర్థి నిలబడితే గట్టిపోటీ ఇవ్వగలమని భావించే, బిజెపి అధినాయకత్వానికి సైతం దీనిపై ఒప్పుకున్నట్లు సమాచారం. హైదరాబాద్ లో రెండు రోజుల క్రితం భాజపా జనసేన అగ్రనాయకులు ఈ సమావేశంలో సైతం తిరుపతి ఉప ఎన్నికల్లో భాజపా అభ్యర్థి అయితేనే మంచి పోటు ఇవ్వగలమని నాయకులు నిర్ణయించారు. ఈ సమావేశం తర్వాత సోము వీర్రాజు నేరుగా తిరుపతి పార్టీ పదాధికారుల సమావేశానికి హాజరయ్యారు. పార్టీ జాతీయ కార్యదర్శి మురళీధర్ సమక్షంలోనే సోము వీర్రాజు తిరుపతి ఉప ఎన్నికల్లో తమ పార్టీ తరపు నుంచి అభ్యర్థిని నిలబెడతామని ప్రకటించారు. దీనికి పదాధికారులు కార్యకర్తల నుంచి పెద్ద ఎత్తున మంచి స్పందన లభించింది. దీంతో బీజేపీ జనసేన పొత్తు లో మరోసారి బిజెపి ముందడుగు వేయగా జనసేన వెనకడుగు కనిపించింది.
దీన్ని ఎలా సమర్దిస్తారు??
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ నుంచి తప్పుకున్న అంశాన్ని, బీజేపీకి బేషరతుగా జనసేన మద్దతు ప్రకటించడం వంటి అంశాలను తెలంగాణ సెంటిమెంట్ కోణంలో జనసేన పార్టీ నాయకులు ఇప్పటివరకు సమర్థించుకున్నారు. అందులోనూ గ్రేటర్ ఎన్నికల్లో బిజెపికి మంచి స్థానాలు లభించడంతో పవన్ ఒక అడుగు వెనక్కి వేయడం వల్లే ఇదంతా సాధ్యం అయిందని జనసేన పార్టీ నాయకులు సర్ది పుచ్చుకున్నారు. అయితే తిరుపతి ఉప ఎన్నికల్లో సైతం మళ్లీ జనసేన పార్టీ వెనకడుగు వేస్తే ఈసారి కార్యకర్తల నుంచి తీవ్ర వ్యతిరేకత తప్పదు. ప్రతిసారి బిజెపి కు తోకగా మారుతుందనే తప్పా పార్టీ ఉనికి గురించి కనీసం పట్టించుకునే పరిస్థితి లేదని ఇప్పటికే కార్యకర్తలు ఆగ్రహం ఉంది. సోము వీర్రాజు మాటలు నిజమై భాజపా నుంచే తిరుపతి లోక్ సభ అభ్యర్థి ప్రకటన ఉంటే కనుక దానికి పవన్ సై అంటే కనుక జనసేన పార్టీ నాయకులు నుంచి పెద్ద ఎత్తున నిరసన తప్పదు. అయితే తిరుపతి లోక్సభ నియోజకవర్గం పరిధిలోని కొన్ని నియోజకవర్గాల్లో కనీసం జనసేన పార్టీ నాయకులు లేరు. అక్కడ ఎలాంటి కమిటీలు లేకుండా పోటీ చేయడం సబబు కాదని పవన్ సమర్థించుకున్న ఇప్పటివరకు కమిటీలు వేయకపోవడం ఏమిటని నాయకుల నుంచి ఎదురు ప్రశ్నలు తప్పవు. ఇక ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం ఎందుకనే అసహనం పార్టీ నాయకుల్లో వస్తే పార్టీ ఉనికికే ప్రమాదం. దీన్ని పవన్ తెలుసుకొని బిజెపి నాయకులతో మాట్లాడి, ముందుకు వెళితేనే పార్టీ కు మంచి జరుగుతుంది.