ఒంగోలు, ఫిబ్రవరి 25: టిడిపి, వైసిపి వర్గీయుల మధ్య ఘర్షణ కారణంగా ఒంగోలు కొత్తపట్నం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
పట్టణ ప్రధాన ఏరియా కమ్మవారిపాలెంలో పార్టీ కార్యాలయ ఏర్పాటుకు వైసిపి నేతలు సన్నాహాలు చేసుకున్నారు. ఈ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవానికి సోమవారం ప్రకాశం జిల్లా వైసిపి అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి బయలుదేరి వచ్చారు. తమ వార్డులో వైసిపి కార్యాలయం ఏర్పాటు చేయడానికి వీలులేదంటూ టిడిపి నేతలు ఆందోళన చేశారు. కొత్తపట్నం బస్టాండ్ వద్ద టిడిపి ఎమ్మెల్యే దామచర్ల జనార్థనరావు వర్గీయులు, మహిళా కార్యకర్తలు రోడ్డుపై భైటాయించి బాలినేని గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు.
బాలినేనికి స్వాగతం పలికేందుకు అక్కడకు చేరుకున్న వైసిపి నాయకులు, కార్యకర్తలు టిడిపి నేతల చర్యలను నిరసిస్తూ ఆందోళనకు దిగారు. ఇరు పార్టీల నాయకులు రాళ్లు రువ్వుకున్నారారు. బాలినేనిని అడ్డుకోవడాన్ని నిరసిస్తూ వైసీపీ కార్యకర్త పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు లాఠీఛార్జి జరిపారు. పోలీసులపై కూడా కార్యకర్తలు తిరగబడ్డారు. ఇద్దరు కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి.
ఎఎస్పి లావన్య సిబ్బందితో అక్కడకు చేరుకున్నారు. ఆందోళన చేస్తున్నఇరు పార్టీల కార్యకర్తలను అదుపులోకి తీసుకుని ఒంగోలు టు టౌన్ పోలీస్ స్టేషన్కు తరలించారు. పరిస్థితులు ఉద్రిక్తంగా ఉండటంతో వైసిపి నేత బాలినేని శ్రీనివాసరెడ్డిని పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి అనుమంచించేది లేదని ఎఎస్పి లావన్య తెలియజేశారు. వెనక్కు వెళ్లాల్సిందిగా సూచించారు. పెద్ధ ఎత్తున కార్యకర్తలు, నాయకులు పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు. పట్టణంలో ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతోంది.
ఆదివారం సాయంత్రం కూడా ఫ్లెక్సీల విషయంపై వైసిపి, టిడిపి నేతల మధ్య ఘర్షణ జరిగింది. పోలీసులు ఇరువర్గాలకు సర్ధి చెప్పారు.