జమ్మూ, మార్చి 8 : జమ్మూ కశ్మీర్లో బస్సుపై గ్రనేడ్ దాడికి పాల్పడింది 9వ తరగతి విద్యార్థి అని నిఘావర్గాలు వెల్లడించాయి. నిందితుడు గ్రనేడ్ను లంచ్ బాక్స్లో తీసుకొచ్చినట్లు పోలీసులు తెలిపారు. గురువారం జరిగిన ఈ దాడిలో ఇద్దరు మృతి చెందగా.. 32 మంది తీవ్రంగా గాయపడ్డారు. నిందితుడు దక్షిణ కశ్మీర్ లోని కుల్గామ్కు చెందినవాడు.
దాడి జరిపి కుల్గామ్కు తిరుగు ప్రయాణమైనా నిందితుడిని పోలీసులు జమ్మూకు 20 కిలోమీటర్ల సమీపంలోని చెక్పాయింట్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు యూట్యూబ్ సాయంతో గ్రనేడ్ విసరటం నేర్చుకున్నాడని నిఘా వర్గాలు వెల్లడించాయి.
దాడిలో ఉత్తరాఖండ్,అనంత్నాగ్కు చెందిన ఇద్దరు వ్యక్తులు మరణించారు. మూడో వ్యక్తి శుక్రవారం ఉదయం చికిత్స పొందుతూ మరణించాడు.
‘ నిందితుడు జమ్ముకు రావడం ఇదే తొలిసారి. అతను కారులో గురువారం ఉదయం ఇక్కడికి చేరుకున్నాడు. అతన్ని తీసుకొచ్చిన కారు డ్రైవర్ కోసం గాలిస్తున్నాము’ అని పోలీసులు తెలిపారు.
నిందితుడు దొరక్కుండా 250 కిలోమీటర్లు ఎలా ప్రయాణించాడు? అది వన్వే ట్రాఫిక్ కలిగిన శ్రీనగర్-జమ్మూ నేషనల్ హైవేపై ఎలా సాధ్యం అనే ప్రశ్నలు తలెత్తున్నాయి.
మరోవైపు ఈ ఘటనపై జమ్మూ ఐజీ ఎంకే సిన్హా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. నిందితుడిని నగ్రోటా టోల్ప్లాజా దగ్గర పట్టుకున్నామనీ, దాడి వెనుక హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థ హస్తముందని తెలిపారు. హిజ్బుల్ సంస్థ కుల్గాం జిల్లా కమాండర్ ఫరూఖ్ అహ్మద్ భట్తో నిందితుడు మాట్లాడినట్లు తేలిందని సిన్హా చెప్పారు. ఫరూఖ్ తనకు గ్రనేడ్ను కుల్గాంలో అందజేశాడని విచారణలో నిందితుడు చెప్పాడని సిన్హా తెలిపారు. జమ్మూలో మతసామరస్యాన్ని దెబ్బతీయడమే లక్ష్యంగా ఈ దాడికి పాల్పడ్డారని సిన్హా పేర్కొన్నారు.