టీఆర్ఎస్లో ‘సీఎం కేటీఆర్’ కోరస్ రోజురోజుకూ పెరుగుతోంది. తాజాగా అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ కూడా గొంతు కలిపారు.
గురువారం సికింద్రాబాద్లో సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ డివిజన్ ఆఫీసు ఓపెనింగ్లో పాల్గొన్న ఆయన ‘‘పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, బహుశా కాబోయే సీఎం.. కేటీఆర్కు శుభాకాంక్షలు. ముఖ్యమంత్రి అయ్యాక రైల్వే ఉద్యోగులకు ఇబ్బందులు రాకుండా కాపాడుతారని ఆకాంక్షిస్తున్న. శాసనసభ, రైల్వే కార్మికుల తరఫున కేటీఆర్కు శుభాకాంక్షలు’’ అంటూ వ్యాఖ్యానించారు. పద్మారావుగౌడ్ ఇలా మాట్లాడుతుండగా స్టేజీపైన మంత్రి కేటీఆర్ కూడా ఉన్నారు. ఆ మాటలు విన్న కేటీఆర్.. పద్మారావును చూస్తూ చిరునవ్వులు నవ్వారు. డిప్యూటీ స్పీకర్ తాజా కామెంట్లతో జరుగుతున్న ప్రచారానికి మరింత బలం చేకూరింది. అది కూడా కేటీఆర్ ఆ పక్కరోజే మరో ఇద్దరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సమక్షంలోనే ఇలా అభినందించడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది.మంత్రి కేటీఆర్ తన ప్రసంగంలో ఎక్కడ కూడా పద్మారావుగౌడ్ మాటలను ఖండించకపోవడం, సమర్థించకపోవడం ఆసక్తిగా మారింది.
సీనియర్ మంత్రి ఈటెల తో మొదలు
కాగా రాష్ట్రంలో త్వరలో అధికార మార్పిడి జరగబోతోందన్న సంకేతాన్ని ముందుగా సీనియర్ మంత్రి ఈటెల రాజేందర్ ఇచ్చారు.ఒక టీవీ చానెల్ఇచ్చిన ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకు బదులుగా కేటీఆర్ అన్ని విధాలా సీఎం పదవికి అర్హుడని ఇప్పటికే ఆయన దాదాపు ఆ బాధ్యతలను మోస్తున్నారని ఆయన బదులిచ్చారు.అందరూ కెటిఆర్ ముఖ్యమంత్రి కావడంలో తప్పేమీ లేదని అది ఎవరికీ అభ్యంతరకర౦ కూడా కాబోదని కూడా ఆయన చెప్పారు.ఆ పక్కరోజే మరో ఇద్దరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు షకీల్’ బాజిరెడ్డి లు కూడా కేటీఆర్ ముఖ్యమంత్రి కాబోతున్నారన్న విధంగా మాట్లాడారు.తామంతా ఇందుకు మద్దతిస్తామని కూడా వారు చెప్పారు.తాజాగా డిప్యూటీ స్పీకర్ పద్మారావు ఏకంగా కేటీఆర్ ని పక్కనే పెట్టుకొని కాబోయే ముఖ్యమంత్రి అని పేర్కొనడంతో ఈ వ్యవహారం చాలా ముందుకు వెళ్లిపోయిందని స్పష్టమవుతోంది.పద్మారావు గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో మంత్రిగా చేశారు. ముఖ్యమంత్రి కుటుంబానికి కూడా ఆయన సన్నిహితులు.ఇప్పుడు ఆయన నోటి వెంటే కాబోయే ముఖ్యమంత్రి అంటూ వ్యాఖ్య రావడంతో కెసిఆర్ పట్టాభిషేకానికి రంగం పూర్తిగా సిద్ధమైపోయిందని,ముహూర్తమే తరువాయి అని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు!