అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్ వి సుబ్రహ్మణ్యం మీద ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, విశ్రాంత ఐఏఎస్ అధికారులు అభ్యంతరం తెలిపారు. ఈ మేరకు వీరు శనివారం చంద్రబాబుకు లేఖ రాశారు.
‘ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఏకపక్షంగా బదిలీ చేసి సిబిఐ కేసుల్లో ఉన్న ఐఏఎస్ను ఆ స్థానంలో నియమించారని’ చంద్రబాబు పలు మార్లు సుబ్రహ్మణ్యం నియామకంపై విమర్శలు చేశారు. దీనిపై మాజీలు ఎల్వి సుబ్రహ్మణ్యం పక్షాన నిలిచారు.
అలాగే రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాల కృష్ణ ద్వివేదితో చంద్రబాబు వ్యవహరించిన తీరు సరిగా లేదని వారు లేఖలో పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ మూడు రోజుల క్రితం చంద్రబాబు సచివాలయంలో ద్వివేదిని కలిసి ఫిర్యాదు చేశారు. కొంతసేపు చర్చ జరిపారు. చర్చలో ఒక సందర్భంలో చంద్రబాబు ద్వివేదీకి వేలు చూపిస్తూ మాట్లాడారు. దీనిపై ప్రతి పక్ష నేతలు విమర్శలు చేశారు. ఇప్పుడు మాజీ ఐఏఎస్లు అభ్యంతరం తెలిపారు.