ఢిల్లీ, ఫిబ్రవరి 11: పరిపాలించే వ్యక్తులు ధర్మాన్ని పాటించనప్పుడు, రాష్ట్రం పట్ల, ప్రాంతం పట్ల వివక్ష చూపించినప్పుడు న్యాయం కోసం పోరాడవలసిన బాధ్యత మనందరిపైనా ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా, విభజన హామీల అమలులో కేంద్రం నిరంకుశంగా వ్యవహరిస్తుందని ఆరోపిస్తూ ఢిల్లీ కేంద్రంగా సోమవారం ధర్మపోరాట దీక్షను చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మరోసారి కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ విమర్శలు చేశారు.
మూడు రోజులు సమయం ఇస్తున్నా, పార్లమెంట్ వేదికగా ఆంధ్రపదేశ్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి, లేకుంటే ప్రజలు మిమ్మల్ని క్షమించరని చంద్రబాబు అన్నారు.
న్యాయపోరాటం కోసమే మనందరమూ కూడా కొన్ని వేల కిలో మీటర్లు ప్రయాణం చేసి వచ్చామని అన్నారు.
పార్లమెంట్లో విభజన చట్టం పెట్టి, హామీలెన్నో ఇచ్చి రాష్ట్రాన్ని విభజించారనీ, హైదరాబాద్ తెలంగాణకు వెళ్లడంతో, నాడు ప్రత్యేక హోదాకు హామీ ఇచ్చారని చంద్రబాబు అన్నారు. ఆంధ్రపదేశ్కు జరిగిన అన్యాయం కోసమే తాము పోరాడుతున్నామనీ, కేంద్రం బిక్ష కోసం కాదని అన్నారు. మీ ఆటలు ఇక సాగవు అని చెప్పేందుకే ఇక్కడికి వచ్చామనీ, ఇది అయిదుకోట్ల ఆంధ్రుల ఆత్మగౌరవం కోసం పోరాటమని చంద్రబాబు అన్నారు.
తాను న్యూఢిల్లీలో ధర్మ పోరాట దీక్ష తలపెడితే, అందుకు ఒక రోజు ముందు ప్రధాని నరేంద్ర మోదీ ఏపీలో పర్యటించారని, ఆ అవసరం ఇప్పుడేమొచ్చిందని చంద్రబాబు ప్రశ్నించారు.
గోద్రా అల్లర్లలో గుజరాత్ పాలకులు ధర్మాన్ని విస్మరించారని నాడు వాజ్పేయి స్వయంగా వ్యాఖ్యానించారని, వారే ఇప్పుడు పాలకులుగా ఉన్నారని చంద్రబాబు విమర్శించారు.
విభజన సమయంలో ప్రధానిగా ఉన్న మన్మోహన్ సింగ్ ఐదేళ్ల పాటు ప్రత్యేక హోదాను ప్రకటిస్తే, నాటి విపక్ష నేత, నేటి ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ, నాటి ఎంపీ, నేటి ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పదేళ్లు హోదా కావాలని డిమాండ్ చేశారని చంద్రబాబు గుర్తు చేశారు. ఇప్పుడు అధికారంలో ఉండి వారు హోదా ఎందుకు ఇవ్వడం లేదని చంద్రబాబు ప్రశ్నించారు.
16 వేల కోట్ల రూపాయల లోటు బడ్జెట్లో ఉన్న రాష్ట్రానికి కేంద్రం కేవలం రూ. 3,900 కోట్లు మాత్రమే ఇచ్చిందని అన్నారు.
విభజన చట్టంలోని 18 హామీలను నెరవేర్చాల్సి వుందనీ, రాయలసీమ, ఉత్తరాంధ్రలకు బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీ ఇస్తామని చెప్పి మోసం చేశారని చంద్రబాబు అన్నారు
రాష్ట్రానికి ఇచ్చిన నిధులను కూడా వెనక్కు తీసుకున్న ఘనత కేంద్రానిదని అన్నారు. విశాఖకు రైల్వే జోన్ ఇస్తామన్న హామీని కూడా నెరవేర్చలేదని చంద్రబాబు అన్నారు.
పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి, నిర్మాణానికి నిధులు ఇవ్వడం లేదని చంద్రబాబు ఆరోపించారు.
అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్యను పెంచుతామన్న హామీని నెరవేర్చలేదనీ, ఇలా ఎన్నో అంశాల్లో రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని గుర్తు చేసి, కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకే హస్తినకు వచ్చామని చంద్రబాబు అన్నారు.
ఈ కార్యక్రమంలో టిడిపి పార్లమెంట్ సభ్యులు, రాష్ట్ర మంత్రులు, మాజీ పార్లమెంట్ సభ్యులు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రత్యేక హోదా సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు చలసాని శ్రీనివాాస్, రాష్ట్రంలోని ఉద్యోగ ఉపాధ్యయ సంఘాల నేతలు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈ ధర్మపోరాట దీక్ష రాత్రి ఎనిమిది గంటల వరకూ కొనసాగుతుంది.