ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామలను ఒక్కటొక్కటిగా నెరవేరుస్తూ వస్తున్నారు. ఇప్పటికే నవరత్నాల పేరుతో సంక్షమ పథకాలను అమలు చేస్తుండగా, పాదయాత్ర సమయంలో వివిధ నియోజకవర్గాల్లో హామీ ఇచ్చిన వివిధ ప్రాజెక్టుల హామీలను నెరవేర్చేపనిలో ఉన్నారు. ఈ క్రమంలో భాగంగా సీఎం జగన్ అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగు నీరు అందేంచేందుకు గానూ మూడు రిజర్వాయర్ల నిర్మాణానికి బుధవారం శంకుస్థాపన చేశారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ముట్టాల, తోపుదుర్తి, దేవరకొండ రిజర్వాయర్లను నిర్మాణానికి భూమిపూజ, పైలాన్ ఆవిష్కరణ కార్యక్రమాలు జరిగాయి. ఈ ప్రాజెక్టుకు వైఎస్ఆర్ అప్పర్ పెన్నార్ ప్రాజెక్టుగా నామకరణం చేశారు. చెన్నేకొత్తపల్లి మండలం వెంకటాంపల్లి గ్రామం వద్ద ఏర్పాటు చేసిన పైలాన్, మూడు రిజర్వాయర్ల భూమి పూజ పనులను సీఎం వైఎస్ జగన్ తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయం నుండి వర్చువల్ పద్ధతిలో ప్రారంభించారు.
ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ అనంతపురం జిల్లాలో కొత్తగా మూడు రిజర్వాయర్లను నిర్మిస్తున్నామనీ, హంద్రినీవా ద్వారా సాగునీటిని అందించి అదనంగా 3.3 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం పెంచడం జరుగుతోందన్నారు. గత ప్రభుత్వాలు ఎన్నికలకు ముందు హామీలను ఇచ్చి వాటిని విస్మరించాయనీ, ఈ ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పకుండా రాప్తాడు నియోజకవర్గానికి లక్ష ఎకరాలు సాగునీరు అందించేలా చర్యలు తీసుకుంటున్నామనీ అన్నారు. హంద్రీనీవా నుండి ప్రత్యేక కాలువ ద్వారా పేరూరు డ్యాంకు నీరు తరలించే మార్గంలోనే మరో నాలుగు సాగునీటి రిజర్వాయర్ల నిర్మాణానికి ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి చేసిన ప్రతిపాదనకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్ చార్జి మంత్రి, మున్సిపల్ శాఖ మంత్రి బొత్సా సత్యనారాయణ, రోడ్లు, భవనాల శాఖ మంత్రి శంకర నారాయణ, పశు సంవర్థక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు, ఎంపి గోరంట్ల మాధవ్, తలారి రంగయ్య పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.