(న్యూఢిల్లీ నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఢిల్లీ చేరుకున్నారు. ఎయిర్ పోర్టు నుండి నేరుగా ఢిల్లీలోని తన నివాసానికి జగన్ చేరుకున్నారు. ఈ రాత్రి ఇక్కడే బసచేస్తారు.
రేపు (మంగళవారం) ఉదయం 10.40 గంటలకు సిఎం వైఎస్ జగన్ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో భేటీ అవుతారు. ఈ సమావేశంలో రాష్ట్రానికి రావాల్సిన నిధులు, విభజన చట్టంలోని పలు అంశాలతో పాటు రాష్ట్రంలో పరిణామాలు తదితర రాజకీయ అంశాలపైనా చర్చలు జరిగే అవకాశం ఉందని అంటున్నారు. ప్రధాన మంత్రి మోడితో భేటీ ముగిసిన తరువాత ఢిల్లీ నుండే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో జగన్ పాల్గొంటారు. ఈ సమావేశంలో తెలంగాణ సీఎం కేసిఆర్ కూడా పాల్గొంటారు.
కాగా ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పలువురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. వారం రోజుల క్రితమే ఢిల్లీకి వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో రెండు పర్యాయాలు భేటీ అయి వివిధ అంశాలపై చర్చించారు. పది రోజుల వ్యవధిలోనే రెండవ సారి ఢిల్లీకి వచ్చి ప్రధాన మంత్రి మోడీతో భేటీ అవుతుండటం, ప్రధాని భేటికి ముందుగా అమిత్ షాతో సమావేశం కావడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకున్నది.
ప్రధాన మంత్రి మోడీతో ఏపి సిఎం జగన్ భేటీ అవుతుండటంతో ఎన్ డీ ఏ సర్కార్లోకి వైసీపీ చేరనున్నదంటూ రాజకీయ వర్గాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతున్నది. అయితే దీనిపై ఏపి ప్రభుత్వ సలహాదారు ఈ వాదనను కొట్టిపారేశారు. ఎన్ డి ఎలో చేరాలని మాకు ఎలాంటి ప్రతిపాదన రాలేదన్నారు. తమకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు లేకుండా మాకు ఎలాంటి పదవులు అవసరం లేదని సజ్జల రామకృషారెడ్డి అన్నారు.