అమరావతి: ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఢిల్లీ పార్లమెంట్ కార్యాలయంలో ప్రధాని మోదితో భేటీ అయ్యారు.
రాష్ట్ర విభజన చట్టంలోని అంశాలకు సంబంధించి పెండింగ్లో ఉన్న నిధులను వెంటనే విడుదల చేయాల్సిందిగా మోదిని జగన్ కోరినట్లు సమాచారం. రాష్ట్రంలో ప్రజలందరికీ రక్షిత మంచినీరు సరఫరా చేసేందుకు వాటర్ గ్రిడ్ అమలుకు నిర్ణయించామనీ, దీనికి నిధులు మంజూరు చేయాలని జగన్ విన్నవించినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో సామాజిక,ఆర్థిక, కుల గణనలో పొరపాట్లు జరిగాయనీ దీని వల్ల ఎస్సి, ఎస్టి, బిసి మైనార్టీ వర్గాలకు అన్యాయం జరుగుతోందని తెలియజేస్తూ ఈ కారణంగా కేంద్రం నుండి గృహాల మంజూరు తగ్గిపోతోందని తెలిపారు. గృహాల మంజూరులో రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలని కోరారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నుండి రావాల్సిన నిధులు వెంటనే విడుదల చేయాలని కోరినట్లు తెలుస్తోంది. ముందుగా పిఎం ప్రిన్సిపల్ సెక్రటరీ నృపేంద్ర మిశ్రాతో ముఖ్యమంత్రి బృందం 40నిమిషాలు సమావేశమయ్యింది. జగన్ వెంట వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, పలువురు ఎంపిలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.