(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
అమరావతి : వలస కూలీల పట్ల మానవతాదృక్పదంతో వ్యవహరించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులకు సూచించారు. లాక్డౌన్ ఎగ్జిట్ ప్రక్రియలో అనుసరించాల్సిన వ్యూహంపై ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కోవిడ్ –19 నివారణా చర్యలు, రైతు భరోసా కేంద్రాలపై సి ఎం వైఎస్ జగన్ గురువారం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కంటైన్మెంట్ క్లస్టర్లలో అనుసరించాల్సిన ఎగ్జిట్ వ్యూహానికి సంబంధించి అధికారులు పలు ప్రతిపాదనలను సిఎంకు వివరించారు.
వలస కూలీల ఆకలి దప్పులు తీర్చాలి
ఇతర రాష్ట్రాల నుంచి రాష్ట్రంలోకి ప్రవేశించి, రాష్ట్రం మీదుగా ఒడిశా, జార్ఖండ్, బిహార్ లాంటి రాష్ట్రాలకు సుదీర్ఘ దూరం నడుచుకుంటూ వెళ్తున్న కూలీలు, ఘటనలపై సమీక్షా సమావేశంలో సీఎం జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. చాలా మంది అవగాహన లేక శ్రామిక రైళ్ల కోసం నిరీక్షించలేక నడుచుకుంటూ వెళ్తున్నారనీ, వ్యవస్థీకృతంగా ఉంటే కనుక ఆయా రాష్ట్రాలతో మాట్లాడి పంపించడానికి అవకాశం ఉంటుందనీ అధికారులు వెల్లడించారు. చెక్ పోస్టుల వద్ద గుర్తించిన వారిని పక్కనే ఉన్న సహాయ కేంద్రాలకు పంపిస్తున్నా, కొంత మంది రోడ్ల వెంట నడుచుకుంటూ వచ్చేస్తున్నారని సీఎం దృష్టికి తెచ్చారు. అయితే అలాంటి వారిని వాళ్ల స్వస్థలాలకు పంపడంపై ఆలోచన చేయాలని సిఎం జగన్ అధికారులను ఆదేశించారు. వారికి ఆకలి బాధలు లేకుండా భోజనం, తాగునీరు సదుపాయాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని సూచించారు. నిర్దిష్ట దూరంలో భోజనం, తాగునీరు వారికి అందించేలా చూడాలన్నారు.
ఎస్ఒపి సిద్ధం చేయాలి
ఇక లాక్డౌన్ ఎగ్జిట్ ప్లాన్లో భాగంగా థియేటర్లు, సినిమా హాళ్లు, రెస్టారెంట్లు, ప్రజా రవాణా, విద్యా సంస్థలు..వీటిలో కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ కార్యకలాపాలు ఎలా కొనసాగించాలో నిర్దిష్ట విధానాలు (ఎస్ఓపీ) సిద్ధం చేయాలని సిఎం ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. వీటిపై ప్రణాళికను అందించాలన్నారు.
రెడ్ జోన్ లో కఠినంగా ఆంక్షలు
ఇప్పటి వరకూ రాష్ట్రంలో 290 కంటైన్మెంట్ క్లస్టర్లు ఉండగా, వీటిలో 75 క్లస్టర్లలో 28 రోజులుగా కొత్త కేసులు నమోదు కాలేదు. వాటిని డీ నోటిఫై చేసి సాధారణ కార్యకలాపాలకు అనుమతివ్వాలని సమావేశంలో నిర్ణయించారు. కేసుల సంఖ్య, విస్తరణ అధికంగా ఉన్న 22 క్లస్టర్లలో 500 మీటర్లుల కంటైన్మెంట్ ఏరియా, 500 మీటర్ల బఫర్ కలుపుకుని ఒక కిలోమీటరు పరిధిలో కంటైన్మెంట్ ఆపరేషన్స్తో పాటు ఇక్కడ ఆంక్షలు కఠినంగా కొనసాగించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.
కేసులు లేకుంటే మే 31 తరువాత ఆంక్షలు సడలింపు
మరొక 103 క్లస్టర్లలో (10, అంత కంటే తక్కువ కేసులు నమోదైన ప్రాంతాలు) 200 మీటర్లు మేర కంటైన్మెంట్, 200 మీటర్ల బఫర్ ఏరియాలు ఉండగా, ఇక్కడ కూడా ఆపరేషన్స్ కొనసాగనున్నాయి. 90 డార్మంట్ క్లస్టర్లలో (గడచిన 14 రోజుల్లో కేసులు నమోదు కాని ప్రాంతాలు) 200 మీటర్ల కంటైన్మెంట్ ఏరియా అమలు కానుంది. కొత్తగా కేసులు రాని పక్షంలో మే 31 తర్వాత ఆ క్లస్టర్లలో సాధారణ కార్యకలాపాలకు అనుమతి ఇస్తారు.
36 పాజిటివ్ కేసులు నమోదు
రాష్ట్రంలో ఉదయం 9 గంటల వరకూ 36 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు అధికారులు సిఎంకు తెలిపారు. ఇవే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి రాష్ట్రానికి వచ్చిన వారిలో మరో 32 కేసులు నమోదు అయ్యాయన్నారు. ముంబై నుంచి వచ్చిన వారికి 29, ఒడిశా–2, బెంగాల్ –1 కేసులుగా నమోదు అయ్యాయని తెలిపారు. ముంబై నుంచి అనంతపురం వచ్చిన వారికి అలాగే, మహారాష్ట్ర నుంచి వచ్చిన వాళ్లలో పాజిటివ్ కేసులు అధికంగా ఉంటున్నాయని చెప్పారు.
జూలై 1 నాటికి ప్రతి పీహెచ్సీకీ ఒక బైక్
టెలీ మెడిసిన్ను మరింత పటిష్టం చేసే చర్యల్లో భాగంగా ప్రతి ప్రాధమిక ఆరోగ్య కేంద్రానికి (పీహెచ్సీ) ఒక బైక్ను జులై 1 నాటికి అందుబాటులోకి తీసుకురావాలని సిఎం ఆదేశాలు ఇచ్చారు. అదే రోజు 108,104 అంబులెన్స్లు 1060 ప్రారంభంతో పాటుగా బైక్ సర్వీసులు కూడా ప్రారంభం కానున్నాయి. టెలి మెడిసిన్ ద్వారా ప్రిస్కిప్షన్ ప్రకారం మందులు డోర్ డెలివరీ చేయడానికే బైక్ల వినియోగించనున్నారు.
సీఎం యాప్
ఈనెల 30వ తేదీన రైతు భరోసా కేంద్రాలు ప్రారంభించే నాటికి మార్కెట్ ఇంటెలిజెన్స్, ప్రొక్యూర్మెంట్ కోసం ఉద్దేశించిన యాప్ అందుబాటులోకి రావాలని ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చారు. దీనిపై కొత్తగా నియమించిన జేసీలకు శిక్షణ ఇస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, మంత్రి మోపిదేవి వెంకటరమణ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి పాల్గొన్నారు.