CM Jagan Kuppam Tour: టీడీపీ అధినేత చంద్రబాబు అడ్డ కుప్పంలో సీఎం జగన్ పర్యటన సంచలనం సృష్టించింది. కుప్పం బీసీలు పోటీ చేయాల్సిన చోట తన రాజకీయ లబ్దికోసం వారి నుండి ఆ సీట్ లాక్కున్నారు. ఇది బాబు మార్కు సామాజిక న్యాయం. చంద్రబాబు కుప్పం నుండి చాలా తీసుకున్నారు. కానీ కుప్పం ప్రజలకు ఏం చేయలేదు..అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక ఇదే సందర్భంలో బహిరంగ సభలో తన ప్రసంగంలో జనవరి నెల నుండి పింఛన్ ₹2750 కి పెంచుతున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు. జగన్ ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న సమయంలో ₹3000 పెంచుకుంటూ పోతామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజలకు ₹2500 పింఛన్ అందుతూ ఉంది.
తమ ప్రభుత్వం మహిళా ప్రభుత్వమని అన్నారు. కుప్పం అంటే అక్కచెల్లెళ్ల అభివృద్ధి అని తెలిపారు. ‘అమ్మ ఒడి” ద్వారా అక్కాచెల్లెళ్లకు అండగా నిలబడ్డామని వాళ్ళ జీవితాల్లో మార్పు తీసుకొస్తున్నామని స్పష్టం చేశారు. గడచిన మూడు సంవత్సరాలలో మహిళలకు ₹1.17 లక్షల కోట్లను పథకాల ద్వారా పంపిణీ చేసినట్లు లెక్కలు తెలియజేశారు. అంతేకాకుండా తమ ప్రభుత్వ పథకాలలో ఎక్కడా కూడా లంచాలకు తావు లేదని, మధ్యవర్తులు లేరని.. వివక్షత కూడా ఎక్కడ లేదని ముఖ్యమంత్రి జగన్.. కుప్పం బహిరంగ సభలో వ్యాఖ్యానించారు. ఈ సందర్బంగా చంద్రబాబు పాలనకు తమ పాలనకు తేడా కూడా ప్రజలు గమనించాలని కోరారు.
వరుసగా “వైయస్సార్ చేయూత” కార్యక్రమం ద్వారా 26 లక్షల మందికి పైగా లబ్ధిదారులకు నిధులు అందిస్తున్నామని అన్నారు. చేయూత ద్వారా అందించే డబ్బు ఎలా ఉపయోగించుకోవాలో స్వేచ్ఛను అక్కచెల్లెమ్మల చేతిలోనే పెట్టామని తెలిపారు. అది సక్రమంగా ఉపయోగించుకోవాలని సీఎం జగన్ సూచించారు. ‘వైయస్సార్ చేయూత’ కార్యక్రమం కుటుంబాన్ని బాధ్యతతో మోస్తున్న వాళ్లకు అండగా ఉండేందుకు అమలు చేస్తున్న కార్యక్రమం అని.. తెలిపారు. ఈ పథకం ద్వారా అక్కచెల్లెమ్మల జీవితంలో వచ్చిన మార్పు అందరికీ స్ఫూర్తిదాయకమని జగన్ స్పష్టం చేశారు. ఒక “వైయస్సార్ చేయూత” ద్వారానే మూడేళ్లలో ₹14,110 కోట్ల సాయం అందించినట్లు పేర్కొన్నారు. ఇదే సమయంలో వచ్చే ఎన్నికలలో ఎమ్మెల్సీగా ఉన్న భరత్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్సీగా ఉన్న భరత్.. నియోజకవర్గ అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని అన్నారు. వచ్చే ఎన్నికలలో భరత్ నీ కుప్పం ప్రజలు గెలిపిస్తే మంత్రిని చేస్తానని బంపర్ ఆఫర్ ఇచ్చారు.