ఇటివల ఆంధ్రప్రదేశ్ లో దళిత వ్యక్తిపై దాడి ఘటన తీవ్ర చర్చనీయాంశమైంది. తూర్పు గోదావరి జిల్లా సీతానగరం పీఎస్ లో జరిగిన శిరోముండనం ఘటన సంచలనం రేపింది. బాధిత యువకుడు ఏకంగా రాష్ట్రపతికి అర్జీ పెట్టుకోవడం వరకూ వెళ్లింది. ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు ఈ ఘటనపై భగ్గుమన్నాయి. ఈ ఘటనపై హోంమంత్రి, డీజీపీ స్పందించి ఘటనకు కారకులపై చర్యలు తీసుకున్నారు. అయితే.. ఈ ఘటనపై ఇప్పటివరకూ సీఎం జగన్ స్పందించలేదు. నిన్న సీఎం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో కలెక్టర్లు, ఎస్పీలతో స్పందన కార్యక్రమంలో భాగంగా జరిపిన వీడియో కాన్ఫరెన్సులో ఈ అంశంపై స్పందించారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారు.
దళితులపై దాడులు సహించేది లేదు..
రాష్ట్రంలో జరిగిన దళితులపై దాడులు, యువకుడికి శిరోముండనం ఘటనలు జరగడం దురదృష్టకరం. ఈ ఘటనలో ఎస్సై స్థాయి వ్యక్తిని జైలుకి పంపించాం. నిష్పక్షపాత విచారణ జరిపించాం. ఇటువంటి ఘటనలు జరుగకుండా ఎస్పీలు, ఏఎస్పీ, డీఎస్పీలు దీనిపై సమావేశాలు నిర్వహించాలి. మానవత్వంపై విడమరచి చెప్పాలి. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలి. ఈ వ్యవస్థలో మార్పులు రావాలి. ప్రజాస్వామ్యంలో మనం ఉన్నాం. గుండు కొట్టించిన ఘటనలో మన బంధువులే ఎలా ఉంటే ఎలా బాధపడతామో ఆలోచించాలి. క్షేత్రస్థాయిలో పోలీసులకు ఈ విషయం వెళ్లేలా చేయాల్సిన బాధ్యత మీదే.
ఎక్కడ తప్పు జరిగినా ఉపేక్షించేది లేదు.
తప్పు చేస్తే ఏస్థాయి వ్యక్తులకైనా శిక్ష పడేలా మన ప్రభుత్వం ఉండాలి. సీఐ, ఎస్సై స్థాయి వ్యక్తులైనా కానిస్టేబుల్స్ అయినా ఈ ప్రభుత్వంలో తప్పు చేస్తే ఉపేక్షించడం లేదు. గత ప్రభుత్వ హయాంలో ఇటువంటి ఘటనలు జరిగినే పట్టించుకున్న వారు లేరు. ఈ ప్రభుత్వంలో చేసి చూపించాలి. ఈ విషయంలో నా దగ్గర నుంచి హోం మినిస్టర్, డీజీపీ, లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీ వరకూ కఠిన నిర్ణయాలు తీసుకునే విధంగా ముందుకెళ్లాలి. రాజకీయ నాయకులకు ఇందులో ప్రమేయం లేకుండా చూడాలి. ఈ ప్రభుత్వంలో హోంమంత్రి దళిత మహిళ. డీజీపీ ఎస్టీకి చెందిన వ్యక్తి. ప్రభుత్వమే ప్రజలను కాపాడలేకపోతే మనం చేపట్టే మంచి పనులకు అర్ధం ఉండదు. ఈ అంశాలన్నింటినీ క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాలి అని సీఎం జగన్ పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు.