పరిపాలనలో సీఎం జగన్మోహన్ రెడ్డి ముద్ర వేరు. సంచలన నిర్ణయాలు తీసుకుంటూ, తీసుకున్న నిర్ణయాలను అమలు చేయడానికి ఏమాత్రం వెనుకాడకుండా ముందుకు వెళ్తున్నారు. ఆయన పరిపాలనపై ఏపీలో ప్రజల అభిప్రాయం ఎలా ఉంది అనే విషయాన్ని పక్కన పెడితే.. జాతీయ స్థాయిలో మాత్రం ఒకింత గుర్తింపు వచ్చింది అని చెప్పుకోవాలి. తాజాగా ఇండియాటుడే నిర్వహించిన సర్వేలోనే దేశంలో ఉత్తమ ముఖ్యమంత్రుల్లో అయన మూడవ స్థానంలో నిలిచారు. మరి ఆంధ్రప్రదేశ్ లోని ఓ కీలకమైన విషయంలో సీఎం జగన్ తప్పతడుగు వేసారా? మంచి నిర్ణయమే తీసుకున్నారా? ఈ విషయంలో ఆయన గెలిచారా? ఓడారా? అనేది కొంచెం చర్చించుకోవాల్సి ఉంటుంది. అదే మద్యం పాలసీ. ఏపీలో మద్యం ధరలు, మద్యం అమ్మకాలు విషయంలో సీఎం జగన్మోహన్ రెడ్డి గెలిచినట్లా? ఓడినట్లా?
మద్యం ధరలు తగ్గినట్లే.. కానీ.. !
ఏపీలో ఈ మధ్య ఒ వార్త హల్ చల్ చేస్తోంది. మద్యం ధరలు 30 నుంచి 40 శాతం వరకు తగ్గించనున్నారు అని భోగట్టా. అది అందరూ ఊహించిన విషయమే. నిజానికి కరోనా లాక్ డౌన్ తర్వాత మద్యం ధరలు 75శాతం వరకు పెంచుతారని ఏ ఒక్కరూ ఊహించలేదు. కానీ సీఎం జగన్మోహన్ రెడ్డి పెంచారు. మళ్లీ ఇప్పుడు వాటిలో 30 లేదా 40 శాతం తగ్గించడానికి కసరత్తు చేస్తున్నారు. అది జరిగే అవకాశమే ఉంది. అంటే ఇది సాధారణంగా అయితే పెద్ద అంశమేమి కాదు. మద్యం ధరలు పెంచడం, తగ్గించడం అనేది ప్రభుత్వ చేతిలోని నిర్ణయం. కానీ సీఎం జగన్ ఇచ్చిన మద్యనిషేద అమలు హామీ ఒకటి పెండింగ్ లో ఉంది కాబట్టి ఈ మద్యం ధరల అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాలి. మద్యం ధరలు పెంచుకుంటూ వెళితే మద్యం అమ్మకాలు తగ్గుతాయి. మద్యం ప్రియులు తగ్గుతారు. బానిసత్వం తగ్గుతుంది తద్వారా మద్యనిషేధం అమలు అనే తన హామీ ఎంతో కొంత నెరవేరుతుందని జగన్ గట్టి నమ్మకం. కానీ ఆయన ముఖ్యమంత్రిగా చేపట్టిన తర్వాత ఇప్పటి వరకు మూడు దఫాలుగా మద్యం ధరలు పెంచారు. ఏమైనా ఫలితం వచ్చిందాఅంటే ఏమీ లేదు. మద్యం అమ్మకాలు అలాగే ఉండగా తిరిగి నాటుసారా ప్రభావం విపరీతంగా పెరిగింది. కరోనా పుణ్యమా, లాక్ డౌన్ పుణ్యమా అని శానిటైజర్ అమ్మకాలు కూడా బీభత్సంగా పెరిగి శానిటైజర్ లు తాగి మరణిస్తున్న సంఖ్య పెరుగుతుంది. ఇప్పటికే రాష్ట్రంలో 50 మంది వరకు శానిటైజర్ లు తాగి మరణించిన చావులు ఉన్నాయి. దీనికి మించిన స్థాయిలో చాపకింద నీరులా పల్లెల్లో నాటుసారా విక్రయం విపరీతంగా వ్యాపిస్తోంది. మద్యనిషేధం అమలు నిర్ణయం తీసుకున్నదే ఇళ్లల్లో మహిళలకు ప్రశాంతత కోసం. పేదవాళ్ల ఆదాయం ఎంతో కొంత నిలబడటం కోసం. కానీ నాటు సారా అమ్మకం ద్వారా ఈ నిర్ణయాలన్నీ బెడిసి కొడుతున్నాయి. అందుకే జగన్ వెనకడుగు వేసినట్లు చెబుతున్నారు.
తగ్గిస్తే మళ్ళీ పెంచుతారా..? జగన్ మదిలో ఏముంది..?
ఓకే లాక్ డౌన్ తర్వాత మద్యం ధరలు 75 శాతం పెంచారు. ఇప్పుడు నేడో రేపో 30 నుంచి 40 శాతం తగ్గించేందుకు ఉత్తర్వులు ఇస్తారు. అంత వరకు సబబే. అప్పుడు మద్యం అమ్మకాలు గతం కంటే కొద్దిగా ఊపందుకుంటాయి. పెరుగుతాయి. మద్యం షాపుల వద్ద బారులు తీరుతారు. అక్కడి వరకు బాగానే ఉంది. కానీ మాద్యనిషేధం అమలు చేయాలంటే మద్యం ధరలు పెంచడం కూడా ఒక మార్గంగా భావిస్తున్న సీఎం వైఎస్ జగన్ మళ్ళీ ధరలు పెంచాల్సి రావడం ఖాయమే. అయితే ఇప్పటికిప్పుడు చేయకపోవచ్చు కానీ కరోనా పూర్తిగా తగ్గిన తర్వాత వచ్చే ఏడాది ఫిబ్రవరి లేదా మార్చి నాటికి మద్యం ధరలు 50 శాతం పెంచడానికి ప్రాధమికంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. అధికారులకు కూడా ఇప్పుడు తగ్గించండి, రెండు నెలల తర్వాత పెంచండి అని సీఎం జగన్ సూచించినట్టు ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే వచ్చే ఏడాది మార్చి లేదా ఏప్రిల్ నాటికి గ్రామ స్థాయిలో ఉన్న దుకాణాలు కూడా పూర్తిగా తీసేసి మండలానికి ఒకటి లేదా రెండు దుకాణాలు మాత్రమే అమలు చేయాలని కూడా ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అంటే మద్యం దుకాణాలు తగ్గించి, ధరలు పెంచడం అనేది వచ్చే ఏడాది మార్చి నాటికి ఖచ్చితంగా కనిపిస్తోంది. ఇది ఎంత వరకు ఫలితాలు ఇస్తుంది అనేది కొద్ది నెలలు ఆగితే గానీ చెప్పలేము.