రాష్ట్రంలో రెగ్యులర్ ఉద్యోగులకు మాదిరిగానే సకాలంలో కాంట్రాక్టు ఉద్యోగులకు జీతాలు అందించాలని సీఎం శ్రీ వైయస్.జగన్ ఆదేశాలు జారీ చేశారు. గ్రీన్ ఛానల్లో పెట్టి వారికి నిర్ణీత సమయానికి జీతాలు అందించాలని జగన్ పేర్కొన్నారు. పర్మినెంట్ ఉద్యోగులకు మల్లెనే సామాజిక, ఆరోగ్య భద్రత కల్పించే దిశగా అధ్యయనం చేయాలనీ, దీనికి సంబంధించి పూర్తి వివరాలు తనకు అందించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.
కాంట్రాక్టు ఉద్యోగుల స్థితిగతులపై క్యాంపు కార్యాలయంలో ఉన్నతాధి కారులతో ముఖ్యమంత్రి జగన్ సమీక్షించారు. వివిధ ప్రభుత్వ విభాగాల్లోని కాంట్రాక్టు ఉద్యోగులు, వారి జీతాలు, స్థితిగతులపై ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు.
రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ విభాగాలు, సొసైటీలు, యూనివర్సిటీల్లో పని చేస్తున్న సుమారు 54 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులకు గత ప్రభుత్వం ఎన్నికలకు ముందు మినిమం టైం స్కేల్పై హడావిడిగా జీవో జారీ చేసి చేతులు దులుపుకుంది. అయినా అమలు చేసే బాధ్యతను ఈ ప్రభుత్వం తీసుకుందని అధికారులు పేర్కొన్నారు.
ముఖ్య మంత్రిగా జగన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత 2019, జూలై నుంచి మినిమం టైం స్కేల్ అమలు చేస్తున్నట్లు సమావేశం పేర్కొంది.
దీని ఫలితంగా..మార్చి 31, 2017 ఉన్న జీతాలు.. జులై, 2019 నాటికి 88 శాతం నుంచి 95 శాతం వరకు పెరిగాయి. జూనియర్ లెక్చరర్కు రూ.19,050 ఉన్న జీతం 2019 జులై నాటికి 95 శాతం పెరిగి రూ.37,100 అయ్యింది. మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ (మేల్) జీతం రూ.14,860 నుంచి 88 శాతం పెరిగి రూ.22,290 అయ్యింది.
సెకండరీ గ్రేడ్ టీచర్స్ (ఎస్జీటీ) జీతం రూ.10,900 నుంచి 95 శాతం పెరిగి రూ.21,230 అయ్యింది. స్కూల్ అసిస్టెంట్ జీతం రూ.10,900 నుంచి 95 శాతం పెరిగి జులై , 2019 నాటి నుంచి రూ. 21,230 అయ్యింది.
దీని వల్ల రాష్ట్ర ఖజానాపై వేయి కోట్ల భారం పడుతుందని అధికారులు వెల్లడించారు. వివిధ సొసైటీలు, విశ్వ విద్యాలయాల్లోని కాంట్రాక్టు ఉద్యోగులకు ఇకపై ఎలాంటి ఇబ్బందులు లేకుండా జీతాలు సకాలంలో అందనున్నాయి.
సమావేశంలో సీఎస్ నీలం సాహ్ని, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రావత్, జీఏడీ సర్వీసెస్ సెక్రటరీ శశిభూషణ్, కార్మిక శాఖ కార్యదర్శి ఉదయలక్ష్మి, ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈఓ మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.