ఉమ్మడి ఏపీలో తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అమలు చేసిన పథకానికి తనయుడు సీఎం జగన్ తూట్లు పొడుస్తున్నారనే విమర్శలు ప్రస్తుతం వస్తున్నాయి. కేంద్రం ఆలోచనను ఏపీలో అమలు చేయాలన్న జగన్ నిర్ణయంపై ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. రైతులోనూ కొత్త అనుమానాలు నెలకొన్నాయి. వీటిని తీర్చడానికి విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి అవస్థలు పడుతున్నారు. అందుకే రాజీనామా, సవాళ్లు అంటున్నారు. ప్రభుత్వ సలహాదారుడు అజయ్ కల్లాం కూడా దీనిపై స్పష్టత ఇవ్వడం లేదు.
ప్రభుత్వ వివరణగా ఎలా ఉందనేది ముఖ్యం..
ఈ విధానంలో రైతుల పొలాల్లో విద్యుత్ మీటలు అమరుస్తారు. నగదు బదిలీ పథకం ద్వారా రైతులతో కొత్త అకౌంట్లు తెరిపించి అందులో బిల్లుల మొత్తాన్ని నగదుగా జమ చేస్తామని అంటోంది. ఈ మొత్తాన్ని డిస్కంలు తీసుకునే విధానాన్ని ప్రవేశపెడతామని.. మోటర్లు కూడా ఉచితంగానే బిగిస్తామని అంటోంది. మంత్రి బాలినేని కూడా ఇదే అంటున్నారు. రైతులకు ఇచ్చే ఉచిత విద్యుత్తుకు ఈ విధానంతో ఓ లెక్క ఉంటుందనేది కేంద్రం భావన.
కానీ.. ఈ విధానం ఉచిత విద్యుత్తుకు మంగళం పాడినట్టేనని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. దీనిపై ప్రభుత్వం కూడా సరైన స్పష్టత ఇవ్వడం లేదు. ఉచిత విద్యుత్తు ఇచ్చేటప్పుడు కొత్తగా మీటర్లు ఎందుకనేది రైతుల ప్రశ్న. కేంద్రం తీసుకొస్తున్న ఈ విధానం వల్ల దాదాపు 25 శాతం మంది రైతుల కనెక్షన్లు తొలగిస్తారని ఓ ప్రచారం ఉంది. అందుకే రైతుల నుంచి కూడా విమర్శలు వస్తున్నాయి.
సీఎం జగన్ ప్రకటనే కీలకం..
ప్రభుత్వం ఇస్తున్న వివరణ కూడా అస్తవ్యస్థంగా ఉన్న సమయంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి స్వయంగా కల్పించుకోవాల్సి ఉంది. ‘రైతులపై ఎటువంటి భారం పడదు.. రైతులకు నష్టం వస్తే మేమే భరిస్తాం’ అనే స్పష్టమైన హామీ ఇస్తే రైతుల్లో జోష్ వస్తుంది. లేదంటే బీజేపీతో దోస్తీ కారణంగానే విద్యుత్ మీటర్ల విధానానికి సీఎం జగన్ శ్రీకారం చుడుతున్నారనే విమర్శలు మోయాల్సి ఉంటుంది. ఇప్పటికే తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. కానీ ఏపీ సీఎం జగన్ మాత్రం రాష్ట్రంలో ప్రవేశపెట్టాలని భావిస్తున్నారు. తెలంగాణలో రైతుబంధు పథకం తరహాలో ఇక్కడ కూడా ఓ పథకం ప్రవేశపెడితే ఉపయోగం ఉంటుందనేది ఏపీ రైతుల వాదన.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?