CM kcr meet PM Modi: మూడు రోజుల పర్యటనలో భాగంగా ఢిల్లీ చేరుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ నేడు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. నిన్న దేశ రాజధాని ఢిల్లీలో టీఆర్ఎస్ భవన నిర్మాణానికి భూమి పూజ చేసిన కేసిఆర్ శుక్రవారం సాయంత్రం ప్రధాని నివాసంలో మోడీతో సమావేశమైయ్యారు., దాదాపు 50 నిమిషాల పాటు కేసిఆర్ పలు విషయాలపై చర్చించారు. ప్రధానంగా తెలంగాణ, ఏపి మధ్య జల వివాదం, రాష్ట్రానికి రావాల్సిన నిధులపై చర్చ జరిపారు. మొత్తం 16 అంశాలపై ప్రధాన మంత్రి మోడీకి కేసిఆర్ వినతి పత్రాన్ని సమర్పించారు.
ఇందులో ప్రధానంగా హైదరాబాద్ – నాగ్ పూర్ ఇండస్ట్రీయల్ కారిడార్, ఐపీఎస్ ల సంఖ్య పెంపు, కొత్త జిల్లాలకు ఐపీఎస్ ల కేటాయింపు తదితర అంశాలు ఉన్నాయి. పిఎంజీఎస్ వైకి అదనపు నిధులు కేటాయింపు, కొత్త జిల్లాలకు జవహర్ నవోదయ విద్యాలయాలను కేటాయించాలని మోడిని కోరారు. కరీంనగర్ కు ఐఐటీ, వరంగల్ లో టెక్స్ టైల్ పార్క్ కు వెయ్యి కోట్లు మంజూరు, మవోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం కోసం కేంద్ర నుండి తగిన రీతిలో సహకారం, తెలంగాణకు గిరిజన వర్శిటీ తదితర విషయాలపై చర్చించి వినతి పత్రాన్ని అందించారు.
యాదాద్రి పుణ్యక్షేత్రం ప్రారంభోత్సవానికి ఆహ్వానం
పనిలో పనిగా తెలంగాణ సర్కార్ ఆత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యాదాద్రి పుణ్యక్షేత్రం పునర్నిర్మాణ కార్యక్రమం పూర్తికావస్తున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీని ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరు కావాలని సీఎం కేసిఆర్ ఆహ్వానించారు. అక్టోబర్, నవంబర్ మాసాల్లో ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేయనున్నట్లు సీఎం తెలిపారు. సీఎం ఆహ్వానానికి సానుకూలంగా స్పందించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తాను తప్పకుండా హాజరవుతానని హామీ ఇచ్చినట్లు సమాచారం.