తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు శుక్రవారం శాసనసభలో 2019–20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తాత్కాలిక బడ్జెట్ ప్రవేశపెట్టారు. ముఖ్యమంత్రి బడ్జెట్ ప్రవేశ పెట్టటం తెలంగాణలో ఇదే తొలిసారి. ఆర్థిక శాఖ కూడా కేసీఆర్ వద్దే ఉండటంతో ఆయనే సభలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టారు.
ముందుగా పుల్వామా ఉగ్రదాడిలో అశువులు బాసిన 40మంది అమర జవాన్లకు సంతాపం తెలుపుతూ కేసిఆర్ సభలో తీర్మానం ప్రవేశపెట్టారు. ఉగ్రదాడిలో మరణించిన ఒక్కొక్క అమర జవాను కుటుంబానికి రూ.25 లక్షలు అందచేయనున్నట్లు ప్రకటన చేశారు. సంతాప తీర్మానానికి సభ ఆమోదం తెలుపుతూ రెండు నిమిషాల పాటు మౌనం పాటించింది. అనంతరం 15 నిమిషాల పాటు వాయిదా పడింది.
అమరులకు నివాళి అనంతరం జిఎస్టి చట్టానికి తీసుకువచ్చిన సవరణ బిల్లును ప్రతిపాదించారు. ఆ తర్వాత కేసీఆర్ 2019-20 సంవత్సరానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టారు.
ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ముఖ్యంశాలు:
- 2019-20 ఆర్థిక సంవత్సరానికి 1,82,017 కోట్లతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ (రూపాయల్లో).
- రెవెన్యూ వ్యయం 1,31,629 కోట్లు
- మూలధన వ్యయం 32,815 కోట్లు
- రెవెన్యూ మిగులు 6,564 కోట్లు
- కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు 1,450 కోట్లు.
- నిరుద్యోగ భృతి కోసం 1,810 కోట్లు
- ఎస్సీల ప్రగతి కోసం 16,581 కోట్లు
- ఎస్టీల అభ్యున్నతి కోసం 9,827 కోట్లు
- మైనార్టీ సంక్షేమానికి 2,004 కోట్లు
- రైతు రుణ మాఫీ కోసం ఆరు వేల కోట్లు
- వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికలు, బోధకాలు వ్యాధిగ్రస్తులు, నేత, గీత కార్మికులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు ఇచ్చే పింఛను మొత్తాన్ని, 1000 నుంచి 2,116 పెంపు.
- దివ్యాంగుల పింఛనును రెండు వేల నుంచి 3,116 పెంపు.
- వృద్ధాప్య పింఛన్కు కనీస వయసు అర్హతను 60 సంవత్సరాల నుంచి 57 సంవత్సరాలకు తగ్గింపు.
- ఆసరా పింఛన్ల కోసం 12,067 కోట్లు.
- బియ్యం రాయితీకి 2,774 కోట్లు
- రైతు బీమా కోసం 650 కోట్లు
- రైతు బంధు సాయం ఎకరానికి పది వేలు. ఇందు కోసం 12 వేల కోట్లు కేటాయింపు
- ఎంబీసీ కార్పొరేషన్కు 1000 కోట్లు
- వ్యవసాయశాఖకు 20,107 కోట్ల కేటాయింపు.
- నీటిపారుదలశాఖకు 22,500 కోట్లు కేటాయింపు
- ఈఎన్టీ, దంత పరీక్షలు 5,536 కోట్లు
- పంచాయతీలకు 2 ఫైనాన్స్ కమిషన్ల నుంచి 3,256 కోట్లు
- ఒక్కో మనిషికి 1,606 చొప్పున ఫైనాన్స్ కమిషన్ నిధులు
- 500 జనాభా కలిగిన గ్రామానికి ఎనిమిది లక్షల రూపాయల నిధులు
- టిఎస్ఐపాస్ ద్వారా 1.41 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు
- టిఎస్ఐపాస్ ద్వారా 8,419 పరిశ్రమలకు అనుమతులు
- వైద్య ఆరోగ్యశాఖకు 5,536 కోట్లు