తెలంగాణ సీఎం కేసిఆర్ ఈ రోజు గిరిజన రిజర్వేషన్ల పై సంచలన ప్రకటన చేశారు. ఆ వర్గాలకు రెండు కీలక హామీలు ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించిన తెలంగాణ ఆదివాసీ, బంజరాల ఆత్మీయ సభకు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు హజరు కాగా సీఎం కేసిఆర్ కీలక ప్రకటన చేశారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో గిరిజనులు 5 నుండి 6 శాతం రిజర్వేషన్లు మాత్రమే పొందగా, తెలంగాణ ఏర్పడిన తర్వాత గిరిజన రిజర్వేషన్లు పది శాతానికి పెంచాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించామన్నారు.
ఏడేళ్లు గడుస్తున్నా ప్రదాని, హోం మంత్రి ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు కేసిఆర్. తెలంగాణ గడ్డపై నుండి చేతులు జోడించి ప్రధానిని అభ్యర్ధిస్తున్నా, గిరిజన రిజర్వేషన్ పై రాష్ట్రపతి ఆమోదముద్ర వేసి పంపిస్తే తాము జివో విడుదల చేస్తామన్నారు కేసిఆర్. గిరిజన రిజర్వేషన్ పై మొరపెట్టుకుని విసిగి వేశారి పోయాం, రాబోయే వారం రోజుల్లో పది శాతం రిజర్వేషన్ ల జివో ను అమలు చేస్తామని పేర్కొన్న సీఎం కేసిఆర్.. ఆ జివోను గౌరవించి అమలు చేస్తారో లేక ఉరితాడు చేసుకుంటారో తేల్చుకోవాలన్నారు. పది శాతం రిజర్వేష్లు రాష్ట్రమే అమలు చేసుకుంటుందని చెప్పారు కేసిఆర్.
అంతే కాకుండా భూమిలేని గిరిజనులకు పోడు భూములను పంపిణీ చేస్తామనీ, అదే విధంగా పోడు భూములు కూడా లేని గిరిజనులకు దళిత బంధు మాదిరిగానే గిరిజన బంధు ద్వారా రూ.10లక్షలు ఆర్ధిక సాయం అందిస్తామని దీనిని వెసులుబాటు చూసుకుని మొదలు పెడతామని కేసిఆర్ హామీ ఇచ్చారు. గిరిజనులకు పది శాతం రిజర్వేషన్లు, గిరిజన బంధు పథకాన్ని సీఎం కేసిఆర్ ప్రకటించడంపై సభకు విచ్చేసిన జనాలు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు.
చిల్లర రాజకీయాలతో తెలంగాణ చరిత్రను వక్రీకరిస్తున్నారంటూ సీఎం కేసిఆర్ మండిపాటు