తెలంగాణ వచ్చి ఆరేళ్లయింది.. రాష్ట్ర ప్రజలు సీఎం కేసీఆర్ కోసం ఈ ఆరేళ్లలో ఎప్పుడైనా ఇంతగా ఎదురు చూస్తున్నారూ.. అంటే.. అది ఈ సమయంలోనే అని చెప్పవచ్చు. కరోనా కష్టకాలంలో తమకు ధైర్యం చెబుతారని, భరోసా ఇస్తారని కోట్ల మంది తెలంగాణ ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు. మార్చి నెల చివర్లో లాక్డౌన్ను మొదటిసారిగా అమలు చేసినప్పుడు సీఎం కేసీఆర్ ప్రజలకు దేవుడిలా కనిపించారు. ప్రజలకు నేనున్నా అని ధైర్యం చెప్పారు. వరుస ప్రెస్ మీట్లు పెట్టి కరోనాపై యుద్ధం ప్రకటించారు. ప్రజలను కాపాడుకుంటామని, బతికుంటే బలుసాకు తిందాం.. ప్రాణాలనైతే కాపాడుకుందాం.. అని ధైర్యం చెప్పారు. కానీ ఇప్పుడు ఆయన కనిపించడమే మానేశారు. ఓ వైపు రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. ఈ సమయంలో ప్రజల్లో తీవ్రమైన భయాందోళన నెలకొంది. దీంతో వారు తమ సీఎం వచ్చి తమకు ధైర్యం చెబుతారని ఎదురు చూస్తున్నారు.
ప్రత్యేక రాష్ట్రం కోసం గళమెత్తి రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు.. ఒకే రోజులో లక్షల మొక్కలు నాటి కొత్త చరిత్రను సృష్టించిన సీఎం.. కేవలం ఒకే రోజులో తెలంగాణ వ్యాప్తంగా ఇంటింటికీ సమగ్ర సర్వే నిర్వహించిన ఘనత ఆయనది. అలాంటి వ్యక్తి కరోనా పట్ల ఎందుకు మౌనంగా ఉన్నారనేది ప్రశ్నార్థకంగా మారింది. రాష్ట్ర హైకోర్టు చాలా సార్లు చెప్పాక కూడా తెలంగాణ ప్రభుత్వం కరోనా టెస్టుల సంఖ్యను పెంచలేదు. చాలా నెమ్మదిగా ర్యాపిడ్ టెస్ట్ కిట్లను వాడడం మొదలు పెట్టింది. ఇతర రాష్ట్రాల సీఎంలలో చాలా మంది నిత్యం ఒకసారైనా మీడియా ముందుకు వచ్చి కరోనా గురించి మాట్లాడుతున్నారు. అయినా తెలంగాణలో పరిస్థితి భిన్నంగా ఉంది. ప్రజలు కరోనాతో గందరగోళానికి గురవుతున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితిలో కాకపోతే.. ఇంకెప్పుడు వారికి ధైర్యం చెబుతారు.. అంటూ ప్రతిపక్ష పార్టీలు కూడా ప్రశ్నిస్తున్నాయి.
ఓ వైపు ప్రేవేటు హాస్పిటళ్లు కరోనా చికిత్స పేరిట జనాల నుంచి భారీగా ఫీజులు వసూలు చేస్తున్నాయి. మరోవైపు ప్రభుత్వ ఆస్పత్రుల్లో సదుపాయాలను పెంచాలని, తమకు జీతాలను ఇవ్వాలని వైద్యులు, సిబ్బంది నిరసనలు చేస్తున్నారు. మరోవైపు ఆరోగ్య శ్రీ లబ్ధిదారులకు ప్రైవేటు హాస్పిటళ్లలో కోవిడ్ చికిత్సను ఉచితంగా అందివ్వాలని కోరుతున్నారు. ఇంకోవైపు రిటైర్డ్ వైద్య నిపుణులు, స్వచ్ఛంద సేవా సంస్థలు కరోనాపై పోరాటం చేసేందుకు ముందుకు వస్తున్నారు. అయినా తెలంగాణ ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తుందని ప్రతిపక్ష పార్టీలు అంటున్నాయి.
కరోనా లాక్డౌన్ ఉన్నప్పుడు ప్రాణాలే ముఖ్యమన్నారు. లాక్డౌన్ ఎత్తేసినప్పుడు దాంతో సహజీవనం చేయక తప్పదన్నారు.. సరే.. జనాలు మీ మాట విన్నారు. కానీ ఇప్పుడు జనాలలో కరోనా భయం పట్టుకుంది. దాన్ని పోగొట్టేవారెవరు ? ప్రజలకు నాయకుడిగా ఉండి వారిని ముందుకు నడిపించేవారే ప్రజలకు ధైర్యం చెప్పకపోతే.. ఇంకెవరు చెబుతారు.. తెలంగాణ సమాజం ప్రస్తుతం అదే కోరుకుంటోంది.. మాకు ధైర్యం చెప్పండి సారూ.. అని వేడుకుంటోంది..!
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?