హైదరాబాద్: ఏపీ టీడీపీ సీనియర్ నేత, తన మిత్రుడు అయిన బొజ్జల గోపాల కృష్ణారెడ్డిని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మర్యాదపూర్వకంగా కలిశారు. బొజ్జల గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో బంజారాహిల్స్ లోని బొజ్జల కృష్ణారెడ్డి ఇంటికి వెళ్లి ఆయనను సీఎం కేసీఆర్ పరామర్శించారు. బొజ్జల ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన నివాసంలోనే మధ్యాహ్న భోజనం చేశారు. కేసీఆర్ తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పటి నుంచి వారి మధ్య స్నేహం ఉంది.
బొజ్జల గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గతంలో పలు సార్లు బొజ్జల ఎమ్మెల్యేగా గెలిచారు. 1989, 1994, 1999 ఎన్నికల్లో బొజ్జల గోపాల కృష్ణారెడ్డి హ్యాట్రిక్ సాధించారు. అయితే, 2004లో అప్పటి వైఎస్ హవా నడిచిన నేపథ్యంలో అప్పటి ఎన్నికల్లో సీఎస్వీ నాయుడు కాంగ్రెస్ తరఫున గెలుపొందారు. మళ్లీ ఆ తర్వాత జరిగిన వరుస ఎన్నికల్లో 2009, 2014లలో టీడీపీ తరఫున బరిలోకి దిగిన బొజ్జల గోపాల కృష్ణారెడ్డి ఘన విజయం సాధించి నియోజకవర్గంలో పట్టు సాధించారు. 2014లొ చంద్రబాబు బొజ్జలకు మంత్రి పదవి కూడా కట్టబెట్టారు. అనంతరం జరిగిన మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణలో ఆయనను మంత్రి పదవి నుంచి తప్పించారు. అనంతరం అనారోగ్య కారణాలతో రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.