భారత రాష్ట్రపది ద్రౌపది ముర్ము రాష్ట్రానికి విచ్చేసిన సందర్భంగా తెలంగాణ రాజ్ భవన్ లో గవర్నర్ తమిళి సై ఏర్పాటు చేసిన విందుకు సీఎం కేసిఆర్ దూరంగా ఉండనున్నారు. శ్రీశైలం పర్యటన ముగించుకుని హకీంపేటకు విచ్చేసిన రాష్ట్రపతి ద్రౌపతి ముర్ముకు అక్కడ గవర్నర్ తమిళసై తో పాటు సీఎం కేసిఆర్ స్వాగతం పలికారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును దుశ్సాలువాతో సత్కరించి బొకే అందజేసి స్వాగతం పలికిన కేసిఆర్ .. అక్కడి నుండి నేరుగా ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు వెళ్లిపోయారు. ప్రగతి భవన్, రాజ్ భవన్ కు మధ్య చాలా రోజులుగా గ్యాప్ ఉన్నతి సంగతి తెలిసిందే. ఈ రాత్రి 7 గంటలకు రాజ్ భవన్ లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన విందు కార్యక్రమానికి పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొననుండగా, కేసిఆర్ మాత్రం దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు.అందుకే ఆయన హకీంపేట నుండి నేరుగా ఫామ్ హౌస్ కు వెళ్లిపోయారు. రాజ్ భవన్ తో దూరంగా ఉంటున్న సీఎం కేసిఆర్ ఇప్పుడు రాష్ట్రపతి వచ్చిన సమయంలోనూ కార్యక్రమానికి దూరంగా ఉండటంతో ప్రగతి భవన్ – రాజ్ భవన్ మధ్య మరింత దూరం పెరిగినట్లుగా భావిస్తున్నారు.
శీతాకాల విడిదిలో భాగంగా నగరానికి విచ్చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అయిదు రోజుల పాటు బొల్లారంలోని ఆర్మీ హెడ్ క్వార్టర్స్ ఆవరణలోని రాష్ట్రపతి నిలయంలో బస చేయనున్నారు. దీంతో భద్రతా దళాలు రాష్ట్రపతి నిలయం పరిసర ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ తో పాటు సిమ్లా, హైదరాబాద్ లోనూ రాష్ట్రపతి అధికారిక నివాసాలు ఉన్నాయి. శీతాకాలంలో కొన్ని రోజుల పాటు హైదరాబాద్ లోని రాష్ట్రపతి నిలయంలో విడిది చేయడంతో పాటు ఇక్కడి నుండే కార్యకలాపాలు నిర్వహించడం ఆనవాయితీ. తొలి రాష్ట్రపతి బాబూ రాజేంద్ర ప్రసాద్ తో పాటు దాదాపు అందరు రాష్ట్రపతులు ఇక్కడ బస చేశారు. కోవిడ్ ఇతర కారణాల వల్ల మూడేళ్ల పాటు రాష్ట్రపతి హైదరాబాద్ నివాసానికి రాలేదు. చివరి సారిగా 2019 డిసెంబర్ లో నాటి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ బొల్లారం లోని రాష్ట్రపతి నిలయాన్ని సందర్శించారు. రెండేళ్ల విరామం తర్వాత ప్రస్తుత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ విడిది కోసం వచ్చారు.
తొలుత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏపిలోని శ్రీశైలం మల్లికార్జున స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన రాష్ట్రపతికి అధికారులు, పూజారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయంలో రాష్ట్రపతి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రపతి వెంట కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ గవర్నర్ తమిళి సై ఉన్నారు. నంది సర్కిల్ వద్ద టూరిజం ఫెసిలిటేషన్ సెంటర్ లో రూ.43 కోట్లతో చేపట్టిన ప్రసాదం ప్రాజెక్టును రాష్ట్రపతి ప్రారంభించారు. ముందుగా సున్నిపెంట వద్ద రాష్ట్రపతికి ఏపి దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి ఘన స్వాగతం పలికారు. శ్రీశైలం క్షేత్రం వద్ద టూరిజం శాఖ మంత్రి రోజా స్వాగతం పలికారు.