కరోనాతో పాటు వివిధ కారణాల వల్ల జీఎస్టీ రెవెన్యూ పడిపోవడంతో రాష్ట్రాలకు పరిహారం చెల్లించే విషయంలో కేంద్రం రెండు ప్రతిపాదనలను రాష్ట్రాల ముందు ఉంచిన విషయం తెల్సిందే. జీఎస్టీ కారణంగా ఎలాంటి నష్టం వాటిల్లినా పూర్తి నష్టపరిహారం చెల్లిస్తామంటూ అమల్లోకి తెచ్చిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఆర్ధిక లోటు కారణంగా చేతులెత్తేస్తుండడంతో బిజెపియేతర రాష్ట్రాలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి.
ఈ విషయమై ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాసారు. కేంద్రం ఇచ్చిన రెండు ప్రతిపాదనలపై కేసీఆర్ పెదవి విరిచారు. జీఎస్టీ కౌన్సిల్ సమావేశాల్లో ఏకగ్రీవంగా నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్నారని, ఇకపై కూడా అలాగే జరగాలని ఆకాంక్షించారు. నష్టపరిహారం విషయంలో బీజేపీయేతర రాష్ట్రాలు ఎక్కువగా నష్టపోతుండడంతో కేసీఆర్ పైవిధంగా స్పందించారు. రాష్ట్రాలకు నష్టాలు వస్తాయని తెలిసినా జీఎస్టీకు మద్దతు పలికామని, కాబట్టి ఈ విషయంలో కేంద్రం ఆదుకోవాల్సిన అవసరం ఉందని కేసీఆర్ లేఖలో స్పష్టం చేసారు.