Mamata banerjee: మమతా బెనర్జీ Mamata banerjee పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా వరుసగా మూడోసారి ఉన్నతపీఠాన్ని అధిష్టించారు. ఎన్నో నాటకీయ పరిణామాలు, రాజకీయాలు, ఉత్కంఠ పరిస్థితులు, ఎత్తుకు పైఎత్తులు, కేంద్రంలోని బీజేపీ పెద్దలనే ఢీకొట్టి మరీ ఆమె ముఖ్యమంత్రి అయ్యారు. అయితే.. చంద్రుడిపై మచ్చ అనే నానుడిలా బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొచ్చి ఆమె మాత్రం స్వల్ప మెజారిటీతో ఓటమి పాలయ్యారు. అయినా.. రాజ్యాంగం కల్పించిన హక్కుతో ఆమె సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. కానీ.. ఆర్నెల్ల లోపు రాష్ట్రంలోని ఏదొక నియోజకవర్గం నుంచి ఆమె తిరిగి ప్రజల నుంచి ఎన్నిక కావాల్సి ఉంది. అయితే.. ఆమె ప్రత్యక్ష ఎన్నికలు కాకుండా మరో మార్గం ఎంచుకున్నట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం ఆమె ఉన్న స్థితిలో ఏదొక నియోజకవర్గం నుంచి గెలుపొందడం తేలికే. కానీ.. ఆమె ఎమ్మెల్సీ హోదాలో ముఖ్యమంత్రి పీఠం అధిష్టించాలని భావిస్తున్నారని సమాచారం. అయితే.. బెంగాల్లో మండలి వ్యవస్థ యాభై ఏళ్ల క్రితమే రద్దైపోయింది. దీంతో ఇప్పుడా వ్యవస్థను మళ్లీ తీసుకొచ్చేందుకు శరవేగంగా ప్రయత్నాలు ప్రారంభించారని అంటున్నారు. 1952లో బెంగాల్లో మొదలైన మండలి వ్యవస్థను 1969లోనే అప్పటి ప్రభుత్వం రద్దు చేసింది. మళ్లీ ఇప్పటివరకూ మండలి వ్యవస్థ అమలు కాలేదు. కేవలం అసెంబ్లీ మాత్రమే ఉంది. ఇప్పుడు తాను ప్రజాక్షేత్రంలో మళ్లీ ఎన్నికలకు వెళ్లాల్సిన తరుణంలో మండలి వ్యవస్థ గురించి ఆలోచన చేశారట. రాజకీయ పరిస్థితులు, ఉత్కంఠ, ప్రచారం.. ఇవన్నీ ఇప్పట్లో మళ్లీ తలకెక్కించుకోవడం ఇష్టం లేక మమత ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
మమత తీసుకొచ్చిన మండలి ఏర్పాటు నిర్ణయంపై మంత్రివర్గం కూడా ఆమోదించిందని తెలుస్తోంది. ఇదే జరిగితే మమతకు కొత్త టెన్షన్లు తప్పి ఎమ్మెల్సీ హోదాలో సీఎం కావొచ్చు.. పాలనపై దృష్టి సారించొచ్చు. పైగా.. భారీగా సీట్లు సాధించినందువల్ల కొందరికి మండలిలో ఎమ్మెల్సీ పదవులు ఇవ్వొచ్చు. ఇలా పార్టీని నమ్ముకున్న నేతలకు కూడా న్యాయం జరుగుతుంది. దీంతో మండలి నిర్ణయమే ఉత్తమమని ఈ నిర్ణయం తీసుకున్నారట. తొలి అసెంబ్లీ సమావేశాల్లో దీనిపై బిల్లు ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోందట మమత ప్రభుత్వం. అయితే.. అసెంబ్లీ ఆమోదించిన బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం తెలపాల్సి ఉంది. దీనిపై కేంద్రం ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.