CM YS Jagan: వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి తన కేబినెట్ ప్రక్షాళనకు సిద్ధం అవుతున్నారు. ప్రమాణం స్వీకారం చేసిన రోజునే వీరి పదవీ కాలం రెండున్నరేళ్లుగా సీఎం జగన్ చెప్పిన సంగతి తెలిసిందే. ఆ సమయం దగ్గర పడుతుండటంతో జగన్మోహనరెడ్డి మంత్రి వర్గ ప్రక్షాళనకు గానూ ఎమ్మెల్యేల పనితీరుపై నిఘా వర్గాల ద్వారా నివేదికలను తెప్పించుకుంటున్నారు. మొత్తం అందరూ ఎమ్మెల్యేలు కాకున్నా మంత్రివర్గంలో అవకాశం కల్పించాలి అని భావిస్తున్న వారికి సంబంధించి పనితీరుపై వివరాలను తెప్పించుకున్నారు. జూలై నెలలో ఒక రిపోర్టు తెప్పించుకున్న జగన్ తాజాగా మరో నివేదిక తెప్పించుకుంటున్నారు. డిసెంబర్ నెలాఖరు లేదా సంక్రాంతి పండుగ నాటికి మంత్రివర్గ ప్రక్షాళన చేయనున్నట్లు సమాచారం అందుతోంది.
CM YS Jagan: జగన్ కు సామాజిక వర్గ పరీక్ష..!
ప్రధానంగా ఇక్కడ చెప్పొచ్చేది ఏమిటంటే.. సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి మంత్రివర్గ విస్తరణ విషయంలో తన సామాజిక వర్గం నుండి ఎక్కువగా ఒత్తిడి వచ్చే పరిస్థితి. రెడ్డి సామాజికవర్గం నుండి ఎక్కువ మంది పోటీ పడుతున్నారు. సాధారణంగా ప్రాంతీయ పార్టీల్లో కులాల గొడవలు అధికంగా ఉంటాయి. దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాలను చూసుకుంటే తెలంగాణలో కులాల గొడవ అంతగా ఉండదు. ఇక్కడ కులాల కంటే ప్రాంతీయ తత్వంపైనే ఎక్కువగా రాజకీయాలు నడుస్తుంటాయి. ఏపి మాత్రం కులాల గొడవ ఎక్కువగానే ఉంటుంది. దేశం మొత్తం మీద కులాల పునాదులపై రాజకీయాలు నడుస్తున్నది ఏపి ఒక్కటే అని కూడా వినబడుతోంది. వైసీపీ అంటే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన పార్టీ. ఈ పార్టీ అధికారంలోకి తరువాత ఆ సామాజికవర్గానికి చెందిన 200 మందికిపైగా పదవులు వచ్చాయి దీంతో ఇప్పుడు అదే రీతిలో మంత్రి వర్గ విస్తరణలోనూ పదవుల కోసం ఎమ్మెల్యేలు పోటీ పడుతున్నారు. వైసీపీలో ఎక్కువ మంది ఎమ్మెల్యేలు 151 మంది ఉండటంతో వారిలో ఉన్న రెడ్డి సామాజికవర్గ ఎమ్మెల్యేలు మంత్రి పదవులను ఆశిస్తున్నారు. పోటీ పడుతున్న ఏ ఒక్కరికి మంత్రిపదవి ఇవ్వకపోయినా వారు పార్టీ నుండి బయటకు వెళ్లడానికి గానీ, పార్టీని గబ్బు చేయడానికి కూడా కొందరు సిద్ధం అయ్యే పరిస్థితి. ఎంతకు తెగించడానికైనా సిద్ధంగా ఉంటారు.
ఆ నలుగురు ఎవరో..?
ఎందుకంటే తొమ్మిది సంవత్సరాల దాహం. 2019లో అధికారంలోకి వచ్చింది అంటే 2013 నుండి వీరు పోరాడారు. అందులో రెడ్డి సామాజికవర్గం వారు చాలా మంది ఉన్నారు. అందుకే సీఎం జగన్ కు సొంత సామాజికవర్గం నుండి ఒత్తిడి అధికంగా ఉంది. ప్రస్తుతం రాష్ట్ర మంత్రి వర్గంలోని 25 మందిలో నలుగురు రెడ్డి సామాజిక వర్గ మంత్రులు ఉన్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డి, పెద్దరెడ్డి రామంచ్దారెడ్డి, బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి, మేకపాటి గౌతమ్ రెడ్డి ఉన్నారు. మొత్తం మంత్రి వర్గ ప్రక్షాళన జరుగుతుందని వార్తలు వస్తున్నాయి కాబట్టి ఈ నలుగురు స్థానంలో మరో నలుగురు రెడ్డి సామాజిక వర్గం ఎమ్మెల్యేలకు మంత్రులుగా అవకాశం రావచ్చు. కాకపోతే ఈ నాలుగు పోస్టులకు 20 మంది పోటీలో ఉన్నారు. ఆ 20మంది కూడా పెద్ద పెద్ద నాయకులే. వారు ఎవరంటే చెవిరెడ్డి భాస్కరరెడ్డి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. వైసీపీలో సీనియర్ నేత, జగన్మోహనరెడ్డికి అత్యంత సన్నిహితుడు. అలాగే ఎమ్మెల్యే రోజా రెడ్డి. ఆమె కూడా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆమె మంత్రి పదవిని ఆశిస్తున్నారు. తరువాత తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి. వైసీపీలో సీనియర్ నాయకుడు, ఇక పూర్తిగా రాజకీయాల నుండి తప్పుకుంటాను తరువాత ఎమ్మెల్యేగా పోటీ చేయను, మంత్రి పదవి ఇవ్వండి అని ఆయన కోరుతున్నారు. చిత్తూరు జిల్లా నుండే ఈ ముగ్గురు మంత్రి పదవులను ఆశిస్తున్నారు. అనంతపురం జిల్లాలో కేతిరెడ్డి సోదరులు ఇద్దరు ఉన్నారు. కేతిరెడ్డి పెద్దారెడ్డి, కేతిరేడ్డి శ్రీనివాసరెడ్డి ఇద్దరూ రెండు సార్లు ఎమ్మెల్యేలుగా గెలిచారు. వీరిద్దరిలో ఒకరికి మంత్రిపదవి అడుగుతున్నారు.
CM YS Jagan: అసమ్మతి ఎలా చల్లారుస్తారో..?
అలానే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (గుంటూరు జిల్లా), అనంత వెంకట రామిరెడ్డి, కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, మేడా మల్లికార్జునరెడ్డి తో సహా మరో పది మంది రెడ్డి సామాజిక వర్గ ఎమ్మెల్యేలు మంత్రపదవులను ఆశిస్తున్నారు. మంత్రి పదవులను ఆశిస్తున్న వీరంతా కూడా పార్టీలో సీనియర్ నేతలే. మంత్రిపదవిని అడగానికి కూడా వారు అర్హులే. ఇంత మంది పోటీ పడుతున్నా నలుగురుకే మంత్రి పదవులు ఇచ్చే అవకాశం ఉంది. దీంతో మంత్రిపదవులు రాని వారు తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గట్టిగా పార్టీ కోసం పోరాడము, మాకు ఎందుకు అవకాశం ఇవ్వలేదు అని ప్రశ్నించే అవకాశం ఉంది. మంత్రి పదవులు రాని వారి నుండి తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. వీళ్లను జగన్మోహనరెడ్డిని ఎలా సర్దుబాటు చేస్తారు అనేది కీలక అంశం. సామ దాన బేద దండోపాయాలు ఉపయోగించి వారి అలకలను కంట్లోల్ చేస్తే జగన్మోహనరెడ్డి ఒక రకంగా సక్సెస్ అయినట్లే.
Read More: Perni Nani: పవన్ వ్యాఖ్యలపై చిరంజీవి విచారం వ్యక్తం చేశారన్న మంత్రి పేర్ని నాని..!!