CM YS Jagan: ఇది నిజంగా కరోనాతో బాధపడే జర్నలిస్ట్ లకు గుడ్ న్యూస్ యే,. కానీ ఇది ఎంత వరకు ఉపయోగపడుతుందో చెప్పలేని పరిస్థితి. జగన్మోహనరెడ్డి సర్కార్ వచ్చిన తరువాత కొత్త అక్రిడిటేషన్లు మంజూరు చేయలేదు. గత సర్కార్ ఇచ్చిన అక్రిడిటేషన్ లను గత ఏడాది డిసెంబర్ వరకూ అయిదు సార్లుగా పొడిగిస్తూ వచ్చారు. ఆ తరువాత పొడిగింపు జరగలేదు. ఈ ఏడాది జనవరి నుండి రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్ట్ లకు అక్రిడిటేషన్ లు మంజూరు కాలేదు. రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది జర్నలిస్ట్ లు వివిధ పత్రికల్లో, ఎలక్ట్రానిక్ మీడియాలో పని చేస్తున్నా వారికి సంస్థ ఇచ్చిన గుర్తింపు కార్డులు మినహా ప్రభుత్వ గుర్తింపు అక్రిడిటేషన్ కార్డులు ప్రస్తుతం లేవు. ప్రభుత్వం ఏ పథకం తీసుకువచ్చినా ముందుగా అడిగేది అక్రిడిటేషన్ కార్డు. అది లేకపోతే ఆ పథకానికి సంబంధించి లబ్ది పొందలేడు. అయితే కరోనా వేళ ప్రభుత్వం ఏమైనా వెసులుబాటు కల్పించిందో ఏమో కానీ ఈ శుభ వార్త అందించింది.
ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ విస్తృతంగా వ్యాపిస్తున్న నేపధ్యంలో జగన్ సర్కార్ ఈ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. కరోనా మహమ్మారి బారినపడి ఇబ్బందులు ఎదుర్కొంటున్న పాత్రికేయులకు వైద్య సేవలు అందించటంలో జిల్లా వైద్య యంత్రాంగానికి, పాత్రికేయులకు మధ్య అనుసంధాన కర్తలుగా పనిచేసేందుకు సమాచార శాఖ రాష్ట్ర స్థాయిలో ఒక సీనియర్ అధికారిని, జిల్లా స్థాయిలో శాఖాధిపతులను నోడల్ అధికారులుగా నియమించింది. ఈ విషయాన్ని సమాచార, పౌరసంబంధాల శాఖ కమిషనర్, ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి, కోవిడ్-19 రాష్ట్ర స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీ సభ్యులు తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. నోడల్ అధికారులు సంబంధిత జిల్లాలలో గుర్తించిన ఆసుపత్రిలో పాత్రికేయులకు వైద్య పరీక్షల నిర్వహణ నుంచి వైద్యం అందించటం, కోవిడ్ ఆసుపత్రిలో అడ్మిట్ చేసుకునే వరకు సహాయకారిగా ఉంటూ అన్ని అవసరమైన వైద్య చర్యలను తీసుకోవలసిందిగా వారిని ఆదేశించారు.
పాత్రికేయులకు వైద్యం అందించేందుకు రాష్ట్ర స్థాయిలో నోడల్ అధికారిగా సమాచార, పౌరసంబంధాల శాఖ సంయుక్త సంచాలకులు పోతుల కిరణ్ కుమార్ (మొబైల్ నెం: 9121215223) ను నియమించామని, అదే విధంగా ప్రతి జిల్లాలో సమాచార శాఖ (ఉపసంచాలకులు/సహాయ సంచాలకులు), సంబంధిత అధికారుల ఫోన్ నంబర్లను పాత్రికేయులకు అందుబాటులో ఉంచి ఎల్ల వేళలా వారికి సేవలు అందించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. పాత్రికేయులు విధినిర్వహణలో భాగంగా అనేక ప్రాంతాలకు వెళ్లవలసి రావటం అలాంటి సందర్భంలో మాస్క్, శానిటైజర్ లు వాడుతూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా సూచించారు. పాత్రికేయుల విధినిర్వహణను దృష్టిలో ఉంచుకొని వారికి వ్యాధి నిరోధక టీకాను వేయించేందుకు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో మాట్లాడి తగు చర్యలను తీసుకోవాల్సిందిగా నోడల్ అధికారులకు సూచనలు ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు. కోవిడ్-19 బారిన పడిన పాత్రికేయులకు ప్రత్యేకంగా ఆసుపత్రులలో బెడ్లు కేటాయించాలని ఇప్పటికే జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసామని తెలిపారు.
దేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా ఏపిలో వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అత్యధికంగా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. ఒక పక్క వైద్యులు కరోనా నియంత్రణకు ముందు వరుసలో నిలబడి వైద్యం అందిస్తున్నారనీ వారికి మీడియా కూడా సహకారం అందించాలని ఈ సందర్భంగా సూచించారు. కోవిడ్ బారిన పడి చనిపోయిన పాత్రికేయులకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 5 లక్షలు సాయం అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. అందుకు సంబంధించిన దరఖాస్తు ఫారం మరియు అన్ని వివరాలతో కూడిన డాక్యుమెంట్లను జిల్లాలోని సమాచార, పౌరసంబంధాల శాఖ అధికారులకు అందజేయాల్సిందిగా కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డి తెలియజేశారు. అక్రిడిటేషన్ కార్డు లేకున్నా సంస్థ గుర్తింపు కార్డులతో ఈ సదుపాయాలు కల్పిస్తే సంతోషించదగిన విషయమే అంటున్నారు జర్నలిస్ట్ లు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?