CM YS Jagan: రాయలసీమ యువతకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి గుడ్ న్యూస్ అందించారు. కడప జిల్లాను ఎలక్ట్రానిక్ హబ్ గా అభివృద్ధి చేయడంతో వేలాది మంది నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయని సీఎం జగన్ పేర్కొన్నారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం కడప జిల్లాకు వెళ్లిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి తొలి రోజు గురువారం ప్రొద్దుటూరులో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. బద్వేల్ లో నూతన ఆర్డీఓ కార్యాలయం ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. అనంతరం గోవవరం వద్ద సెంచురీ ఫ్లైవుడ్ పరిశ్రమకు శంకుస్థాపన చేశారు. తరువాత కమలాపురం నియోజకవర్గంలోని కొప్పర్తిలో పలు పరిశ్రమలకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ కోప్పర్తిలో మెగా పారిశ్రామిక పార్క్ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. ఇండస్టీయల్ హబ్ నిర్మాణం కోసం రూ.1585 కోట్లు వెచ్చించినట్లు తెలిపారు. ఈ హబ్ లో ప్రస్తుతం ఆరు కంపెనీలు పెట్టుబడులు పెడుతున్నాయన్నారు. ఇప్పటికే వంద కోట్ల రూపాయలు ఖర్చు చేశామని పేర్కొన్న వైఎస్ జగన్ .. మరో ఆరు నెలల్లో 7,500 మందికి ఉద్యోగాలు కంపెనీల ద్వారా రానున్నాయని అన్నారు. ఎలక్ట్రానిక్ హబ్ తో దాదాపు 75 వేల మంది యువతకు ఉద్యోగాలు లభిస్తాయని సీఎం చెప్పారు. ఇక్కడ ట్రైనింగ్ పూర్తి చేసుకున్న యువత ఉద్యోగాల్లో చేరి పని చేస్తారని పేర్కొన్నారు. ఈ మెగా పారిశ్రామిక హబ్ తో రాబోయే రోజుల్ల రాయలసీమ రూపురేఖలు మారిపోతాయని సీఎం జగన్ అన్నారు. కొప్పర్తి సెజ్ లో ఇండస్ట్రియల్ పార్క్ లను ప్రభుత్వం అభివృద్ధి చేసింది. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు రూ.515.90 కోట్లు కేటాయించడం పట్ల సీఎం వైఎస్ జగన్ కు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. జిల్లా మంత్రి ఆదిమూలపు సురేష్, పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా అధికారులు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.