YSRCP: వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి అధికారంలోకి వెయ్యి రోజులు దాటింది. అయితే ఇప్పటి వరకూ ప్రభుత్వ పాలన, సంక్షేమ పథకాల అమలుపైనే సీఎం జగన్ దృష్టి పెట్టారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుపైనే ఎక్కువ శ్రద్ధ పెట్టారు. ఆ క్రమంలో 90 శాతం నేరవేర్చారు. అయితే అభివృద్ధి కుంటుపడిందనే మాట వినబడుతోంది. దీంతో కొన్ని వర్గాల్లో ప్రభుత్వంపై, వైసీపీపై కొంత అసంతృప్తిగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో రాబోయే రెండేళ్లలో ఎటువంటి ప్రణాళికతో ముందుకు వెళ్లాలి అనే దానిపై సీఎం జగన్ దృష్టి పెట్టినట్లు సమాచారం.
YSRCP: 15వ తేదీ వైసీపీ ప్రజాప్రతినిధులతో భేటీ
ఈ క్రమంలోనే ఈ నెల 15వ తేదీన వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, నియోజకవర్గ ఇన్ చార్జిలు, ముఖ్యనేతలతో సీఎం వైఎస్ జగన్ సమావేశం కానున్నారని విశ్వసనీయ సమాచారం. ఉగాది లోపుగా మంత్రి వర్గ ప్రక్షాళన కూడా చేయనున్న నేపథ్యంలో జిల్లాల్లో ఎవరెవరికి మంత్రి వర్గంలో అవకాశం కల్పించాలి. వైసీపీ ప్లీనరీ, జిల్లాల విభజన, ఈ రెండేళ్లు ప్రజా ప్రతినిధులు, నేతలు నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలి తదితర విషయాలపై చర్చించే అవకాశం ఉందని అంటున్నారు. రాజకీయంగా వైసీపీ ఎలాంటి వ్యూహాలతో ముందుకు సాగాలి అనే వాటిపై జగన్ దిశానిర్ధేశం చేయనున్నారు.
YSRCP: బ్యాడ్ ఫీడ్ బ్యాక్ ఉన్న వాళ్లతో..
ఆ భేటీ అనంతరం ఏయే నియోజకవర్గాల్లో ప్రజా ప్రతినిధులపై బ్యాడ్ ఫీడ్ బ్యాక్ ఉందో వాళ్లను నేరుగా జిల్లా ఇన్ చార్జిలు, రాష్ట్ర ముఖ్యనేతలు పార్టీ కేంద్ర కార్యాలయానికి పిలిపించి మాట్లాడతారని సమాచారం. ఈ నెల 25వ తేదీ వరకూ శాసనసభ సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే అందుకే 16వ తేదీ నుండి 25వ తేదీ వరకూ ప్రజల్లో వ్యతిరేకత ఉన్న 20 – 30 మంది ఎమ్మెల్యేలతో పార్టీ ముఖ్యనేతలు నేరుగా సమావేశాలు నిర్వహించున్నారని సమాచారం. క్షేత్ర స్థాయిలో వారిపై ఉన్న వ్యతిరేకత పొగొట్టుకునేందుకు వారు ఏమి చేయాలి. పార్టీ బలోపేతానికి ఎటువంటి చర్యలు చేపట్టాలని తదితర అంశాలపై సూచనలు, సలహాలు అందిస్తారుట.
2024 ఎన్నికల్లోనూ గెలుపే లక్ష్యం
2024 ఎన్నికల్లోనూ గెలుపే లక్ష్యంగా పని చేయాలంటే వైసీపీ ఎలాంటి వ్యూహాలతో ముందుకు వెళ్లాలి అనే వాటిపై దృష్టి పెట్టనున్నారు. ఇప్పటి వరకూ జగన్మోహనరెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎమ్మెల్యేలతో నేరుగా మాట్లాడిన సందర్భం లేదు. కొందరు ఎమ్మెల్యేలు మాత్రమే అడపదడపా జగన్మోహనరెడ్డితో భేటీ అయ్యారు. ఈ నెల 15వ తేదీ వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ఇన్ చార్జిలతో జగన్ భేటీ కానున్నారని వార్తలు రావడం, ఇది మొదటి సారి జరుగుతుండటంతో ప్రాధాన్యతను సంతరించుకోబోతున్నది అంటున్నారు. ఇప్పుడు జరగబోతున్న ఈ తతంగం మొత్తం చూసుకుంటే రాబోయే ఎన్నికలకు వైసీపీ సన్నద్దం అవుతున్నట్లు కనబడుతోంది.