(అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)
ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి మరో పథకానికి శ్రీకారం చుట్టారు. చిరు వ్యాపారులను ఆదుకునేందుకు జగనన్న తోడు పథకాన్ని ప్రారంభించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుండి బుధవారం 9.05 లక్షల మంది చిరు వ్యాపారులకు 905 కోట్ల రూపాయల మేర వడ్డీ లేని రుణాలను ఆన్ లైన్ ద్వారా వారి బ్యాంకు ఖాతాలో జమ చేశారు.
ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ చిరు వ్యాపారులు అనేక మంది వడ్డీతో అప్పులు తెచ్చుకుని అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. వారిని ఆదుకునేందుకే ఈ పథకాన్ని ప్రారంభించామన్నారు. స్వయం సహాయక సంఘాల మాదిరిగా పది వేలు తీసుకున్న లబ్దిదారులు సక్రమంగా బ్యాంకులకు రుణాలను చెల్లించి మళ్లీ రుణాలు పొందవచ్చని చెప్పారు. ప్రతి మూడు నెలలకు ఒక సారి లబ్దిదారుడి ఖాతాలో వడ్డీ సొమ్ము జమ చేయడం జరుగుతుందన్నారు. ఈ పథకం కింద రోడ్డు పక్కన రోజు వారీ వ్యాపారాలు చేసుకునే వారు. తోపుడు బండ్లు, చిన్న చిన్న కూరగాయల వ్యాపారులు, రోడ్డు పక్కన టీ, టిఫిన్ తదితర చిన్న చిన్న దుకాణ దారులు అర్హులని చెప్పారు. ఈ పథకం కింద ప్రస్తుతం జాబితాలో పేరు లేని వారు గ్రామ సచివాలయాల్లో పేర్లు నమోదు చేసుకుంటే వారికీ ఈ వడ్డీ లేని రుణాలు అందుతాయని చెప్పారు. వాలంటీర్లు, సచివాలయ వెల్పేర్ అసిస్టెంట్ లు అర్హులను గుర్తించి రుణం మంజూరు అయ్యేలా చర్యులు తీసుకుంటారని చెప్పారు. ఈ కార్యక్రమంలో వివిధ జిల్లాల నుండి మంత్రులు, కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, లబ్దిదారులు పాల్గొన్నారు. పలువురు లబ్దిదారులు ఈ సందర్భంగా సీఎం జగన్మోహనరెడ్డికి ఈ పథకాన్ని అమలు చేయడం పట్ల ధన్యవాదాలు తెలిపారు.