నెల్లూరు జిల్లాలో రూ.460 కోట్ల అంచనా వ్యయంతో జరగనున్న సోమశిల హైలెవల్ కెనాల్ ఫేజ్ 2 పనులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి నేడు శంకుస్థాపన చేశారు. వర్చువల్ విధానంలో తాడేపల్లి సీఎం క్యాంపు ఆఫీసు నుండి సీఎం జగన్ ఈ పనులను ప్రారంభించారు. నెల్లూరు జిల్లాలోని దుర్బిక్ష ప్రాంతాలను సశ్యశ్యామలం చేసేందుకు సోమశిల హైలెవల్ కెనాల్ ఫేజ్ 1 నిర్మాణ పనులు ఇప్పటికే జరుగుతున్నాయి. తాజాగా రూ.460కోట్లతో ఫేజ్ 1 నిర్మాణ పనులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ కాలువ పనులు పూర్తి అయితే జిల్లాలో మెట్ట ప్రాంతాలైన ఉదయగిరి, వింజమూరు. దుత్తల్లూరు. ఆత్మకూరుతో పాటు ప్రకాశం జిల్లాలోని పలు గ్రామాలకు నీరు పుష్కలంగా అందుతుంది.
సోమశిలలో రివర్స్ టెండరింగ్తో రూ.68 కోట్లు ఆదా
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి మాట్లాడుతూ దశాబ్దాలుగా మెట్ట ప్రాంత వాసులు కలలుగన్న సాగునీటి సమస్య పరిష్కారం కానున్నదని చెప్పారు. ఫేజ్ 1, ఫేజ్ 2 పనులు పూర్తి అయితే 90వేల ఎకరాలకు సాగునీరు అందడటంతో పాటు తాగునీరు సమస్య కూడా తీరుతుందన్నారు. మన ప్రభుత్వానికి వ్యవసాయం, నీటి విలువ తెలుసుననీ, పెన్నా నది నీటిని సద్వినియోగం చేసుకుంటూ మరిన్ని ప్రాంతాలకు సాగునీరు, తాగునీటిని అందించే సోమశిల రెండో దశ పనులు ప్రారంభించామన్నారు. ఆత్మకూరు, ఉదయగిరి నియోజకవర్గాల్లోని మెట్ట ప్రాంతాలకు సాగు, తాగునీరు అందుతుందన్నారు. ఆత్మకూరులో 10,103 ఎకరాలు, ఉదయగిరిలో 36,350 ఎకరాలకు సాగునీరు అందుతుందని సీఎం జగన్ అన్నారు. రూ.527 కోట్లతో సోమశిలను ఎన్నికల ముందు హడావుడిగా నిర్మించాలని గత ప్రభుత్వం ఆరాటపడింది కానీ ఎలాంటి పనులు చేయలేదని జగన్ పేర్కొన్నారు. సోమశిల ప్రాజెక్టు రివర్స్ టెండరింగ్ ద్వారా రూ.68 కోట్లు ప్రభుత్వానికి ఆదా చేయడం జరిగిందన్నారు. సోమశిల ప్రాజెక్టు పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామని పేర్కొన్నారు జగన్. వంశధార ఫేజ్ 1, వంశధార నాగావళి అనుసంధానం, వెలిగొండ ఫేజ్ 1, అవుకు టన్నెల్ -2, సంగం, నెల్లూరు బ్యారేజీలను పూర్తి చేస్తామన్నారు. అదే విధంగా కండలేరు కాలువ, సోమశిల ఉత్తర కాలువ డబ్లింగ్ పనులు ప్రారంభిస్తామని సీఎం జగన్ చెప్పారు.
2022 ఖరీఫ్ సీజన్ నాటికి పోలవరం పూర్తి చేస్తాం
2022 ఖరీఫ్ సీజన్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని జగన్ పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టుతో పాటు ఆరు ప్రధాన ప్రాజెక్టులను పూర్తి చేస్తామని చెప్పారు. రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో 40వేల కోట్లతో కరువు నివారణ చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. కృష్ణానదికి దిగువ బ్యారేజీలకు వేగవంతంగా అడుగులు వేస్తున్నామన్నారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పనులు పూర్తి చేస్తామనీ, నీటి ప్రయోజనాల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు సీఎం జగన్. కాగా మద్దిపాడు మండలం కృష్ణాపురం వద్ద సోమశిల హైలెవల్ కెనాల్ ఫేజ్ 2 పనుల ప్రారంభోత్సవంలో మంత్రులు అనిల్ కుమార్, మేకపాటి గౌతమ్ రెడ్డి పాల్గొన్నారు.