Ys Jagan Mohan Reddy: ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి Ys Jagan Mohan Reddy పాలన పరంగా తనదైన మార్కు వేసారు. సీఎంగా ఆయన క్యాంపు కార్యాలయం నుంచే అన్ని వ్యవస్థల్నీ పర్యవేక్షిస్తున్నారు. కరోనా సమయంలో గతేడాది దేశంలోనే ఎక్కువ టెస్టులు చేసి కరోనా కట్టడికి తీసుకున్న చర్యలు సత్ఫలితాలను ఇచ్చాయి. సెకండ్ వేవ్ లో కూడా టెస్టులు అధికంగా చేస్తున్నారు. వ్యాక్సినేషన్ కూడా పకడ్బందీగా జరిగేలా చూస్తున్నారు. అవసరమైన వనరుల్ని తెప్పించుకునే క్రమంలో ప్రధానికి లేఖ రాసి మరీ సమకూరుస్తున్నారు. అయితే.. కానీ.. సీఎంగా క్షేత్రస్థాయి పరిస్థితులను కూడా తెలుసుకోవడం మరింత ముఖ్యం. ఎన్ని వనరుల్ని సమకూర్చినా ఎక్కడోచోట విమర్శలు వస్తున్నాయి. తిరుపతి రుయాలో ఆక్సిజన్ ఘటనే ఇందుకు నిదర్శనం.
రాష్ట్రంలో ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ప్రైవైటు హాస్పిటల్స్ దందా అనే వార్తలు వస్తూనే ఉన్నాయి. రెమిడెసివర్ ఇంజెక్షన్ బ్లాక్ మార్కెట్ లో దొరుకుతోందనే విమర్శలూ ఉన్నాయి. సాక్షాత్తూ జిల్లా స్థాయి అధికారి.. ఏపీ ఎంఐపిపిడి సుబ్బారాయుడుకు చికిత్స అందించడంలో వైద్యుల నిర్లక్ష్యం వహించిన ఘటన సంచలనం రేపింది. ఇటువంటి పరిస్థితులను సీఎంగా పర్యటిస్తే మరోసారి ఈతరహా తప్పులు జరగ్గపోవచ్చు. ఇటువంటి సమయంలో సీఎం హోదాలో ఒక్క పర్యటన చేసి ఏ ఒక్క ప్రభుత్వాసుపత్రి పరిశీలన చేసినా ఆ ఇంపాక్ట్ రాష్ట్రం మొత్తం మీద పడుతుంది. సీఎం వస్తున్నారంటే అధికారులు, ప్రభుత్వ వైద్యుల్లో యాక్టివ్ నెస్ వస్తుంది. వ్యవస్థలు మరింత బాగా పని చేస్తాయి. సమస్యలు స్వయంగా తెలుసుకున్నట్టవుతుంది. బాధితులకు భరోసా లభిస్తుంది.
ప్రజల కోసం అత్యాధునిక వైద్య సదుపాయాలు కల్పిస్తున్న ప్రభుత్వం.. మరింత అప్రమత్తతో ఉందని ప్రజల్లోకి తీసుకెళ్లడం ముఖ్యం. రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం ఏం చేస్తుందో మరింతగా తెలియాలి. ‘సీఎం పర్యటిస్తున్నారు..’ అనే భయం వ్యవస్థల్లో ఉంటే ప్రజలకు మరింతగా సేవలు అందుతాయి. పబ్లిసిటీకి దూరంగా ఉండాలనే నిర్ణయమే అయినా.. విమర్శలకు అవకాశం ఇవ్వకుండా చేసుకోవడం ముఖ్యం. కానీ.. జగన్ సీఎం అయ్యాక అసలు ప్రెస్ ముందుకే రాలేదు. ప్రస్తుత విపత్కర సమయంలో ప్రజలకు భరోసానిచ్చేలా ఒక్క ప్రెస్ మీట్ పెట్టినా.. క్షేత్రస్థాయిలో పర్యటించినా ప్రజల్లోకి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు మరింతగా వెళ్లే అవకాశం ఉంటుంది.