CM YS Jagan: ఏపి వైద్య, ఆరోగ్య శాఖలో ఖాళీ పోస్టుల భర్తీకి జగన్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దాదాపు 14,200 పోస్టుల భర్తీకి సీఎం జగన్ ఆమోదం తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సిబ్బంది కొరత అనేది ఉండకూడదనే ఉద్దేశంతో భారీగా రిక్రూట్మెంట్ చేయాలని ఆదేశాలను ఇచ్చారు సీఎం జగన్. అక్టోబర్ ఒకటవ తేదీ నుండి మొదలు పెట్టి నవంబర్ 15 నాటికి పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించాలని జగన్ ఆదేశించారు.
తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం నాడు కోవిడ్ 19 నివారణ, నియంత్రణ, వాక్సినేషన్ తో పాటు వైద్య ఆరోగ్య శాఖ పై సీఎం జగన్ సమీక్ష జరిపారు. పీహెచ్సీలు మొదలు కొని బోధనాసుపత్రుల వరకూ వివిధ స్థాయిలో ఉన్న సిబ్బంది, కావాల్సిన సిబ్బందిపై జగన్ ఆరా తీశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ వైద్య ఆరోగ్య శాఖలో కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతూ ఆసుపత్రులు నిర్మిస్తున్నా తీరా అక్కడకు వెళితే సిబ్బంది లేక రోగులు ఇబ్బందులు పడే పరిస్థితి ఉందనీ, సంవత్సరాల తరబడి ఇలాంటి సమస్యలే మనం చూస్తున్నామనీ, ఇకపై ఆ సమస్యలకు చెక్ పెట్టాలన్నారు.
పేద వర్గాలకు మెరుగైన వైద్యం అందించాలి, వారు వైద్యం కోసం భారీగా ఖర్చులు చేయాల్సిన పరిస్థితి పోవాలని అన్నారు. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తో పాటు అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు సరిపడా సిబ్బందితో సమర్ధవంతంగా నడవాలనీ, ఒక వైద్యుడు సెలవు పై వెలితే ఆ స్థానంలో మరో వైద్యుడు విధులు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇదే సందర్భంగా రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితి, థర్డ్ వేవ్ వస్తే సన్నద్ధతకు తీసుకున్న చర్యలను అధికారులు వివరించారు. అదే విధంగా వ్యాక్సినేషన్ ప్రగతి తదితర విషయాలపై సీఎం జగన్ కు అధికారులు తెలియజేయగా సంతృప్తి వ్యక్తం చేశారు.
Read more: TTD Board: టీటీడీ ప్రత్యేక ఆహ్వానితుల వివాదం..! సుప్రీంలో ముందరి కాళ్లకు బంధం..!!