అమరావతి: ఏపిఎండిసి ద్వారా ఇసుక విక్రయాలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో సెప్టెంబరు ఐదవ తేదీ నుండి నూతన ఇసుక పాలసీ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. కొత్త ఇసుక విధానం పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి నేడు సమక్ష నిర్వహించారు.
ప్రస్తుతం లభిస్తున్న రేట్లకన్నా తక్కువ రేట్లకే ఇసుకను అందించాలని సీఎం ఆదేశించారు. అవినీతి లేకుండా, ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా, పర్యావరణాన్ని పరక్షించేలా పారదర్శక విధానం రూపొందించాలనీ ముఖ్యమంత్రి ఆదేశించారు.
ఇసుక రీచ్ల వద్ద స్టాక్యార్డులు, నగరాలు, పట్టణాల్లో అదనపు స్టాక్ యార్డులు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇసుకరీచ్ నుంచి స్టాక్యార్డు వద్దకు తరలింపునకు ఒక రశీదు, స్టాక్యార్డునుంచి వినియోగదారుడుకు చేరేంత వరకూ మరొక రశీదు ఇవ్వాలని నిర్ణయించారు. రీచ్ ల వద్ద సిసి కెమెరాల ఏర్పాటు చేయనున్నామని తెలిపారు.
ఇసుక బయటకు వెళ్లేటప్పుడు కూడా వే బ్రిడ్జి ద్వారా లెక్కింపు నిర్వహించాలని సూసించారు.
రీచ్లు, స్టాక్యార్డుల వద్ద అక్రమాలను అడ్డుకునేందుకే ఈ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అలాగే ఇసుక తవ్వకాలు, తరలింపులో వాడే వాహనాలకు జీపీఎస్ తప్పనిసరి చేయనున్నారు.
ఇసుక అక్రమతవ్వకాలు, అక్రమ రవాణాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని సిఎం ఆదేశించారు.
రెండు నెలల కాలంలో ఇసుక రవాణా వాహనాల గుర్తింపు, వాటికి జీపీఎస్ అమరిక, ఇతర సాంకేతిక సన్నాహాలు, వేబ్రిడ్జి, సీసీ కెమెరాల ఏర్పాటు, స్టాక్యార్డుల ఏర్పాటు పూర్తిచేయాలని ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశించారు.
ఇసుక వినియోగదారుల కోసం ఒక యాప్, వెబ్ పోర్టల్ను ఏపిఎండిసి తయారుచేయనున్నదని సిఎం తెలిపారు. కొత్త ఇసుక విధానం అమల్లోకి వచ్చేంత వరకూ ఇసుక అందించే బాధ్యత కలెక్టర్ ల పర్యవేక్షణలో కొనసాగుతుందని జగన్ తెలిపారు.
ప్రభుత్వానికి, వినియోగదారుడుకు పరస్పరం మేలు జరిగేలా గనులశాఖ ధరను నిర్ణయించాలనీ సిఎం ఆదేశించారు.
వినియోగదారులు కోరిన వెంటనే ఇసుకను అందుబాటులో ఉంచేలా రవాణావ్యవస్థను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సూచించారు.