CM YS Jagan: ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అధ్యక్షతన బుధవారం (28వ తేదీ) ఉదయం 11 గంటలకు సచివాలయంలో కేబినెట్ సమావేశం కానుంది. ఎజెండాలోని పలు కీలక అంశాలపై చర్చ జరపనున్నారు. అన్ లైన్ సినిమా టికెట్ల అమ్మకాల ఆర్డినెన్స్ కు ఆమోదం తెలుపనున్నట్లు సమాచారం. అదే విధంగా సినిమాటోగ్రఫీ చట్ట సవరణకు కేబినెట్ ఆమోదం తెలుపనుంది. వచ్చే నెలలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై చర్చ జరుగనుంది. టీటీడీలో ప్రత్యేక ఆహ్వానితుల నియామక అంశంపైనా చర్చ, చట్ట సవరణ పై చర్చించనున్నారు. దేవాదాయ స్థలాలు, దుకాణాల లీజు అంశంపై చట్ట సవరణ, దేవాదాయ శాఖలో విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ వింగ్ ఏర్పాటుపై మంత్రివర్గ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.
Read More: AP CM YS Jagan: ఏపిలో భారీ టూరిజం ప్రాజెక్టులకు జగన్ సర్కార్ గ్రీన్ సిగ్నల్..!!
CM YS Jagan: గవర్నర్ బిశ్వభూషణ్ తో సీఎం జగన్ సమావేశం
కేబినెట్ భేటీ అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి రాజ్ భవన్ కు చేరుకుని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తో సమావేశం కానున్నారు. టీడీపీ కార్యాలయం సహా నేతలపై వైసీపీ శ్రేణుల దాడులపై ప్రతిపక్ష నేత చంద్రబాబు మొన్న ఢిల్లీలో రాష్ట్రపతిని కలిసి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో అరాచక పాలన జరుగుతోందనీ, 356 ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతి పాలన విధించాలని చంద్రబాబు రాష్ట్రపతిని కోరారు.
Read More: Viveka Murder Case: వివేకా హత్య కేసులో చార్జిషీట్ దాఖలు చేసిన సీబీఐ ..! ఈ నలుగురే నిందితులు..!!
ఈ నేపథ్యంలో గవర్నర్ తో సీఎం జగన్ భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ సందర్భంలో సీఎం జగన్ .. టీడీపీ కార్యాలయంపై దాడుల అంశంపై వివరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దాడులకు దారి తీసిన పరిస్థితులను గవర్నర్ కు సీఎం జగన్ వివరించనున్నట్లు సమాచారం. దాడులకు ముందు టీడీపీ నేతలు తనను ఉద్దేశించి చేసిన దూషణలకు సంబంధించి సీడీలు, ఇతర అధారాలను గవర్నర్ కు సమర్పించే అవకాశాలు ఉన్నాయి. అదే విధంగా వచ్చే నెలలో శాసనసభ సమావేశాల నిర్వహించాలని సిఎం జగన్ భావిస్తున్నందున, సభ నిర్వహణల పైనా గవర్నర్ తో సీఎం జగన్ చర్చించే అవకాశాలు ఉన్నాయి.