అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి రేపు పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత ఆయన తొలి సారిగా పోలవరం ప్రాజెక్టు పరిశీలనకు వెళుతున్నారు. ఈ నెల మొదటివారంలో జలవనరుల శాఖ అధికారులతో జరిగిన సమీక్ష సమావేశంలో త్వరలోనే తాను పోలవరం ప్రాజెక్టు సందరిస్తానని జగన్ చెప్పారు. ప్రత్యక్షంగా పరిశీలన చేసి పూర్తి స్థాయిలో సమీక్షిద్దామని నాడు జగన్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నేడు నీటి పారుదల శాఖ మంత్రి అనిల్కుమార్ తొలి సారిగా ప్రాజెక్టును సందర్శించి పనులపై అధికారులతో సమీక్ష జరిపారు. మంత్రి అనిల్కుమార్ వెంట డిప్యూటి సిఎం ఆళ్ల నాని, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజులు ఉన్నారు.
పోలవరం ప్రాజెక్టు సందర్శన అనంతరం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరో మారు ఢిల్లీకి వెళ్లి పోలవరం ప్రాజెక్టుకు నిధులు, ఇతర అంశాలపై కేంద్రంలోని ఉన్నతాధికారులతో చర్చించే అవకాశం ఉంది.