పోలవరం ప్రాజెక్టును వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి చేయాలన్న కృతనిశ్చయంతో జగన్ సర్కార్ ఉన్న విషయం తెలిసిందే. ఇటీవల అసెంబ్లీ శీతాకాల సమావేశాలోనూ పోలవరంపై జరిగిన చర్చ సందర్భంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, నీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ లు ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. ఈ క్రమంలో సీఎం జగన్ పోలవరం పర్యటన ప్రాధాన్యతను సంతరించుకోంది.
సోమవారం వైఎస్ జగన్ పోలవరం ప్రాజెక్ట్ ను సందర్శిస్తున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో సంబంధిత జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. తొలుత రేపు పోలవరం నిర్మాణ పనులతో పాటు స్పిల్ వే, స్పిల్ ఛానల్ పనులు పరిశీలిస్తారు. అనంతరం పోలవరం నిర్మాణ పనులపై అధికారులు, కాంట్రాక్టర్ లతో జగన్ సమీక్ష నిర్వహించనున్నారు.
కాగా పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో స్పిల్ వేలో 2,17,443 క్యూబిక్ మీటర్లు కాంక్రీట్ పనులు పూర్తి చేయగా స్పిల్ వే పిల్లర్లు పై 100 గడ్డర్లు ఏర్పాటు తో 52మీటర్లు ఎత్తుకు నిర్మించారు. గేట్ల ఏర్పాటులో కీలకమైన 48 ట్రూనియన్ బీమ్ లకు గానూ 30 బీమ్ ల నిర్మాణం పూర్తి చేశారు. స్పిల్ ఛానల్ లో 1,10,033 క్యూబిక్ మీటర్లు, అలాగే 10,64,417 క్యూబిక్ మీటర్ల మట్టి పనులు పూర్తి చేశారు. పోలవరం ప్రాజెక్టు పనులు వేగవంతం ఈ క్రమంలో భాగంగా సీఎం వైఎస్ జగన్ కేంద్రాన్ని ఒప్పించి పెండింగ్ బకాయిల విడుదలకు కృషి చేశారు. ఇటీవలే కేంద్రం రూ.2,234 కోట్ల రూపాయలు విడుదల చేసింది.