పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీకి మరో షాక్ తగిలింది. ఇప్పటికే ఆమె మంత్రివర్గంలోని సభ్యులు, టీఎంసీ నేతలు పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీఎంసీ నేతలపై సీబీఐ దాడుల పరంపర కొనసాగుతోంది. పశువుల అక్రమ రవాణా కేసులో టీఎంసీ నేత అనుబ్రత మోండల్ ను ఇంతకు ముందే సీబీఐ అరెస్టు చేసి జైలుకు పంపగా, ఇటీవలే టీచర్స్ రిక్రూట్మెంట్ స్కామ్ లో మంత్రి పార్ధ చటర్జీని సీబీఐ అరెస్టు చేసి రిమాండ్ కు తరలించింది. ఇప్పుడు తాజాగా బొగ్గు స్మగ్లింగ్ కేసుకు సంబంధించి పశ్చిమ బెంగాల్ న్యాయశాఖ మంత్రి మోలోయ్ ఘటక్ నివాసం, కార్యాలయాలపై సీబీఐ బృందం దాడులు చేసింది. పశ్చిమ బర్దమాన్ జిల్లాలోని అసన్ సోల్ లో ఆయనకు ఉన్న మూడు నివాసాల్లో, కోల్ కతాలోని లేక్ గార్డెన్ లో ఉన్న నివాసంలో ఒకే సారి సోదాలు నిర్వహిస్తున్నారు సీబీఐ బృందాలు. ఈ సారి సోదాల్లో సీబీఐకి చెందిన మహిళా అధికారులు కూడా పాల్గొనడం విశేషం. ఈ కేసుకు సంబంధించి మోలోయ్ ఘటక్ ను గతంలో ఈడీ ప్రశ్నించింది. సీఎం మమత బెనర్జీ మేనల్లుడ టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ సహా పలువురు టీఎంసీ నేతలు కేంద్ర దర్యాప్తు సంస్థల నిఘాలో ఉన్న తరుణంలో ఈ సోదాలు జరుగుతున్నాయి.
మోలోయ్ ఘటక్ నిన్న కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా కు వ్యతిరేకంగా ట్వీట్ చేశారు. అమిత్ షా పర్యవేక్షణలో దేశ వ్యవహారాలు భయానంగా ఉన్నాయంటూ విమర్శించారు. బొగ్గు కుంభకోణంలో ఇంతకు ముందు అభిషేక్ బెనర్జీని ఈడీ పలు మార్లు విచారించింది. బొగ్గు స్మగ్లింగ్ కు సంబంధించి సీబీఐ 2020 నవంబర్ నెలలో కేసు నమోదు చేసింది. బొగ్గు అక్రమ రవాణా కేసులో గత ఏడాది ఆగస్టులో ఢిల్లీలోని ప్రత్యేక కోర్టులో ఈడీ తన మొదటి చార్జిషీటును దాఖలు చేసింది. వినయ్ మిశ్రా సోదరుడు వికాస్, బంకురా పోలీస్ స్టేషన్ మాజీ అధికారి అశోక్ మిశ్రాను ప్రధాన నిందితులుగా పేర్కొన్న ఈడీ.. అభిషేక్ బెనర్జీ పేరు ను చార్జిషీట్ లో పేర్కొనలేదు. మరో పక్క పశ్చిమ బెంగాల్ లో నియమితులైన ఎనిమిది మంది ఐపీఎస్ అధికారులకు ఇటీవల విచారణకు హజరుకావాలంటూ సమన్లు జారీ చేసింది.
సీబీఐకి చెందిన అధికారులు మాట్లాడుతూ… బోగ్గు అక్రమ రవాణఆ కేసులో ఆరోపణలు రావడంతో విచారణ చేపట్టామనీ, దర్యాప్తులో భాగంగా మోలోయ్ ఘటక్ పేరు వెలుగులోకి వచ్చిందని చెప్పారు. ఈ స్మగ్లింగ్ లో ఘటక్ పాత్ర ఏమిటనేది దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. స్మగ్లింగ్ లో ఘటక్ పాత్ర ఉందనే కీలక ఆధారాలు తమ వద్ద ఉన్నాయని వెల్లడించారు. అసన్ పోల్ కు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ఈస్టర్న్ కోల్డ్ ఫీల్డ్ లిమిటెడ్ కు చెందిన మైన్స్ నుండి బొగ్గు అక్రమ రవాణా జరిగిందని సీబీఐ ఆరోపిస్తొంది. బ్లాక్ మార్కెట్ లో వేల కోట్ల రూపాయల విలువైన బొగ్గును విక్రయించారని చెబుతోంది. గత కొన్నేళ్లుగా ఈ స్మగ్లింగ్ రాకెట్ కార్యకలాపాలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.
Video Viral: బాలుడిని గాయపర్చి కుక్క .. యజమానిపై కేసు నమోదు..ఎందుకంటే..?