న్యూఢిల్లీ, జనవరి 30: నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స కంపెనీ అయిన దేవన్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (డిహెచ్ఎఫ్ఎల్) దాదాపు 31వేల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని లూటీ చేసిందని కోబ్రా పోస్టు వెబ్ సైట్ సంచలన కథనం వెలువరించింది. 45 డొల్ల కంపెనీల ద్వారా అక్రమ లావాదేవీలు జరిపి ఈ భారీ కుంభకోణానికి పాల్పడినట్లు పేర్కొంది.
కోబ్రా పోస్ట్ కథనం ప్రకారం బ్యాంకు రుణాల ద్వారా సేకరించిన నిధులు డొల్ల కంపెనీల ద్వారా డిహెచ్ఎఫ్ఎల్ ప్రమోటర్లకు చేరాయి. ఈ ధనాన్ని విదేశాలలో ఆస్థులు కొనుగోలు చేసేందుకు వినియోగించారు. శ్రీలంకలో ఒక క్రికెట్ జట్టును కొనుగోలు చేసేందుకు కూడా నిధులను వినియోగించారు.
కోబ్రా పోస్టు బుధవారం మీడియా సమావేశంలో ఈ ‘అతి పెద్ద ఫైనాన్షియల్ స్కామ్’ గురించి ప్రకటించింది. మాజీ ఆర్ధిక మంత్రి యశ్వంత్ సిన్హా, న్యాయవాది ప్రశాంత్ భూషణ్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. డిహెచ్ఎఫ్ఎల్ ఈ ఆరోపణలను తోచిపుచ్చింది. కోబ్రా పోస్టు కథనం వెలువడిన వెంటనే డిహెచ్ఎఫ్ఎల్ షేర్ల ధర పతనం కావడం మొదలయింది. ఆడిటర్లు, ప్రభుత్వ యంత్రాగం అప్రమత్తంగా లేకపోవడం వల్ల ఇంత పెద్ద కుంభకోణం సాధ్యమయిందని కోబ్రా పోస్టు వ్యాఖ్యానించింది.
డిహెచ్ఎఫ్ఎల్ ప్రమోటర్లయిన వాధ్వాన్ సోదరులకు చెందిన గ్రూప్ కంపెనీలు బిజెపికి చట్ట విరుద్ధంగా 19.5 కోట్ల రూపాయ విరాళాలు ఇచ్చినట్లు తమ పరిశోధనలో బయటపడిందని కోబ్రా పోస్టు వెల్లడించింది. బిజెపి ఈ అంశంపై ఇంతవరకూ స్పందించలేదు.
కోబ్రా పోస్టు కథనం ప్రకారం, కపిల్ వాద్వాన్, అరుణా వాద్వాన్ తదితరులు ఒకే అడ్రస్తో ఉన్న అనేక డొల్ల కంపెనీలను ప్రారంభించారు. కేవలం లక్ష లోపు వ్యయంతో ఏర్పాటు చేసిన కంపెనీలు దాదాపు 45 ఉన్నట్లు చెబుతున్నారు. వీటిలో 34 కంపెనీలకు వాద్వాన్ కుటుంబ సభ్యులతో ప్రత్యక్ష సంబంధాలు కలిగి ఉన్నాయని పేర్కొంది.
21,477 కోట్ల రూపాయల నిధులు వివిధ డొల్ల కంపెనీలకు రుణాలుగా, పెట్టుబడులుగా అందించారు. వీటికి సంబంధించిన వివరాలు కంపెనీ ఆర్థిక నివేదికలో పొందుపర్చలేదు. అక్రమంగా తరలించిన ఈ సొమ్ముల ద్వారా ప్రమోటర్లు విదేశాల్లో సొంత ఆస్తులు, పెద్ద పెద్ద కంపెనీల్లో పెట్టుబడులు పెట్టినట్లు కోబ్రా పేర్కొంది. డిహెచ్ఎఫ్ఎల్ ముఖ్య ప్రమోటర్లు కపిల్ వాద్వాన్, అరుణా వాద్వాన్, ధీరజ్ వాద్వాన్లు ఇంగ్లాండ్, దుబాయి, మారిషన్, శ్రీలంక దేశాల్లో వ్యక్తిగతంగా అస్తులు కూడ బెట్టారు.