Collector: టీఆర్ఎస్ ద్వారా ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్న తెలంగాణలోని సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి సోమవారం తన పదవికి రాజీనామా చేశారు.చీఫ్ సెక్రటరీని కలిసి ఆయన రాజీనామా పత్రాన్ని అందజేయగా అది తక్షణ ఆమోదం పొందింది.
ఆయన సర్వీసు విషయానికొస్తే వెంకట్రామిరెడ్డి తొలుత న్యాయవాదిగా పనిచేశారు.1996 లో గ్రూప్ 1 డిప్యూటీ కలెక్టర్ గా ఆయన పోస్టింగ్ తీసుకున్నారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో బందర్, చిత్తూరు ,తిరుపతి ఆర్డీవోగా పనిచేశారు.మెదక్ పీడీ డ్వామాలో డైరెక్టర్ గా పనిచేశారు.హర్యానా అర్బన్ డెవ్లప్ మెంట్ అథారిటీ సెక్రటరీగా, జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ గా మెదక్ జాయింట్ కలెక్టర్ గా ,సిద్దిపేట,సంగారెడ్డి కలెక్టర్ గా పనిచేశారు.
Collector: కేసీఆర్ కాళ్ల మీద పడ్డ కలెక్టర్ ఈయనే!
ఇక ఇదే వెంకట్రామిరెడ్డి కలెక్టర్ గా ఉండగానే ఒక బహిరంగ సభలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు పాదాభివందనం చేశారు.అప్పట్లో అది ఆ రాష్ట్రంలో హాట్ టాపిక్ అయింది.తాజాగా వరి విత్తనాలు అమ్మితే జైలుకు పంపిస్తానని వ్యాపారులను కలెక్టర్ హోదాలో వెంకట్రామిరెడ్డి హెచ్చరించటం కూడా వివాదాస్పదమైంది.వరి వేయవద్దన్న ముఖ్యమంత్రి కెసిఆర్ మనోభావాల అనుగుణంగానే కలెక్టర్ గా ఉండి వెంకట్రామిరెడ్డి ఈ తరహా హెచ్చరికలు చేశారని విమర్శలు వెల్లువెత్తాయి. ఒక్కమాటలో చెప్పాలంటే కలెక్టర్ గా ఉన్నప్పటికీ వెంకట్రామిరెడ్డి టీఆర్ఎస్ నాయకుడి మాదిరి వ్యవహరిస్తూ వచ్చారు అంటారు.ఇక ఆ ముసుగు తీసేసి నేరుగా తన పదవికి సైతం రాజీనామా చేసి వెంకట్రామిరెడ్డి రాజకీయాల్లోకి వచ్చారు.టీఆర్ఎస్ లో ఆయనకు ముఖ్యమైన పదవి లభించబోతున్నట్లు ఆ పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.
Collector: కెసిఆర్ అనుమతితోనే రాజీనామా!
ఒక జిల్లాకే పరిమితం కాకుండా తెలంగాణ రాష్ట్రం మొత్తానికి టీఆర్ఎస్ కార్యకర్తగా సేవలందిస్తానని తనను అనుమతించాలని తాను కోరగా ముఖ్యమంత్రి కెసిఆర్ అంగీకరించడంతోనే తన పదవికి రాజీనామా చేసినట్లు వెంకట్రామిరెడ్డి మీడియాకు తెలిపారు. సీఎం కేసీఆర్ ఏ బాధ్యతలు అప్పగించినా స్వీకరించి చేసేందుకు సిద్ధంగా ఉన్నానని మాజీ ఐఏఎస్ వెంకట్రామి రెడ్డి వివరించారు.
తెలంగాణకు కేసీఆర్ తండ్రి!
కలెక్టర్ గా ఉంటూ కేసీఆర్ కాళ్లపై పడ్డ తన చర్యను వెంకట్రామిరెడ్డి
సమర్థించుకున్నారు.ఆయన తెలంగాణకు తండ్రి వంటి వారిని,అందుకనే పాదాభివందనం చేశానని చెప్పారు.పుట్టపర్తి సాయిబాబా కాళ్లపై ప్రధాని ,రాష్ట్రపతి వంటి వారే పడ్డారని ఆయన ఈ సందర్బంగా వ్యాఖ్యానించారు. వరి విత్తనాల విషయంలో తన ప్రకటనను మీడియా వక్రీకరించిందన్నారు.తన కుటుంబీకులకు చెందిన రాజపుత్ర కంపెనీలో టీఆర్ఎస్ నేతలకు వాటాలు ఉన్నాయా ఆన్న ప్రశ్నకు ఆయన సమాధానం దాటవేశారు.ఏదేమైనా ఒక కలెక్టర్ తన పదవికి సైతం రాజీనామా చేసి రాజకీయాల్లోకి వెళ్లటం అరుదైన విషయమే.