ఆచరణ విషయంలో ప్రజలకు సూచనలు చేసే ముందు అవి తమతో సహా అందరికీ వర్తిస్తాయని ప్రభుత్వ పెద్దలు గుర్తించాలి. తాము ఆచరించి ప్రజలకు ఆదర్శంగా నిలవాలి. కానీ ఏపీ ముఖ్యమంత్రి జగన్ ప్రజలకు సూచనలు ఇస్తూ తాను ఆచరించకపోవడం విమర్శలకు తావిస్తోంది. ప్రస్తుతం అంతా కరోనా మయం అయిపోయింది. బతుకు జీవుడా అన్నట్టున్నాయి పరిస్థితులు. ప్రజల కోసం ప్రభుత్వం సమర్ధవంతమైన చర్యలు తీసుకుంటోంది. అదే విధంగా కరోనా మహమ్మారి బారిన పడకుండా ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలో కూడా వివరిస్తోంది.
ముఖ్యమంత్రి జగన్ సైతం ఎన్నో జాగ్రత్తలు చెప్తున్నారు. ప్రజలకు మాస్కులు పెట్టుకోవడంపై అవగాహన పెంచాలని పోలీసు, రెవెన్యూ శాఖలను కోరుతోంది వైద్య శాఖ. ఈ జాగ్రత్తలు చెప్తున్న ప్రభుత్వ పెద్దలు మాత్రం ఈ సూచనలు పాటించటం లేదు. సాక్షాత్తూ ముఖ్యమంత్రే ఈ విషయంలో ఆదర్శంగా ఉండాల్సింది.. అసలు ఆయన మాస్కు పెట్టుకోరు. ఎటువంటి సమీక్షలు నిర్వహించినా ఆయన ముఖంపై మాస్కు ఉండదు. ఇటివల 108, 104 సర్వీసులు ప్రారంభోత్సవ సమయంలో సీఎం మామూలు మాస్క్ పెట్టుకుంటే.. సాక్షాత్తూ వైద్య శాఖ మంత్రి ఆళ్ల నాని అసలు మాస్కే పెట్టుకోలేదు. దీనిపై అనేక విమర్శలు వచ్చాయి.
ప్రస్తుతం ఏపీలో మాస్కు తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది వైద్యశాఖ. ముందు సీఎంకు మాస్కు పెట్టుకోవడంపై అవగాహన పెంచండి అనే కామెంట్లు వస్తున్నాయి. ఆయనతో పాటు సొసైటీ అంతా బాగుండాలంటే మాస్కు ధరించమనండి అంటున్నారు. మాస్క్ పెట్టుకోనంటే పెట్టుకోనన్న అమెరికా అధ్యక్షుడు సైతం పరిస్థితి తీవ్రతకు భయపడి ఇటివల మాస్కు పెట్టుకుని కనిపిస్తున్నారు. మరి.. ఏపీ సీఎం ఎప్పుడు మాస్క్ పెట్టుకుంటారు అంటున్నారు.