కామన్వెల్త్ క్రీడల్లో భారత క్రీడాకారులు పతకాల పంట పండిస్తూ రికార్డులు కొల్లగొడుతున్నారు. తాజాగా టేబుల్ టెన్నీస్ క్రీడాకారిణి భవీనా పటేల్ భారత్ కు బంగారు పతకాన్ని అందించింది. పారా టేబుల్ టెన్నీస్ సింగిల్స్ 3-5 కేటగిరిలో దేశానికి స్వర్ణ పతకం తీసుకొచ్చింది. నైజీరియా క్రీడాకారిణి క్రిస్టియానాతో జరిగిన ఫైనల్ మాచ్ లో గుజరాత్ కు చెందిన భవీనా పటేల్ 3 -0 తో తిరుగులేని విజయాన్ని సాధించింది. ఈ విజయంతో కామన్వెల్త్ క్రీడల్లో టేబుల్ టెన్నీస్ విభాగంలో బంగారు పతకం సాధించిన తొలి భారత క్రీడాకారీణిగా భవీనా రికార్డుకెక్కారు.
కాగా కామన్వెల్త్ క్రీడల్లో తొమ్మిదవ రోజైన శనివారం భారత్ ఖాతాలో మొత్తం మూడు స్వర్ణ, మూడు రజతాలు, అయిదు కాంస్యాలతో మొత్తం 11 పతకాలు చేరాయి. భారత బాక్సర్లు అమిత్ పంఘల్, నిఖల్ జరీన్ ఇప్పటికే పతకాలు ఖాయం చేయగా, క్రికెట్ లో టీమిండియా మహిళా జట్టు ఫైనల్ కు చేరుకుని కనీసం రజత పతకం ఖాయం చేశారు. రెజ్లింగ్ 57 కేజీల విభాగంలో టోక్యో ఒలింపిక్స్ రజత పతక విజేత రవికుమార్ దహియా కామన్వెల్త్ క్రీడల్లో తొలి స్వర్ణాన్ని దక్కించుకున్నారు. 2014, 2018 కామన్వెల్త్ క్రీడల్లో వినేష్ ఫాగట్ ముచ్చటగా మూడో టైటిల్ గెలుచుకుంది.
తాజా పతకాలతో భారత్ మొత్తం 40 పతకాలు సాధించి పట్టికలో అయిదో స్థానానికి చేరుకుంది. వీటిలో 13 స్వర్ణాలు, 11 రజతాలు, 16 కాంస్య పతకాలు ఉన్నాయి.