మోపిదేవి వెంకటరమణ రాజ్యసభకు వెళ్లడంతో ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ స్థానిక ఉప ఎన్నిక నిర్వహించేందుకు ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఆగష్టు 24న ఈ ఎన్నిక జరుగనుంది. అదే రోజు సాయంత్రం ఫలితాలు కూడా వెల్లడి కానున్నాయి. ఈ స్థానం పక్కాగా వైసీదే. శాసనసభలో వైసీపీ సభ్యలు బలం చూస్తే వైసీపీకే ఈ స్థానం ఖాయం అని చెప్పాలి. దీంతో ఈ స్థానం ఎవరికి కేటాయించాలనే విషయంపై సీఎం జగన్ దృష్టి సారించారు. మరోవైపు ఈ స్థానం కోసం ఆశావాహులు తమ ప్రయత్నాలు సైతం మొదలుపెట్టారు. ఈ ఒక్క స్థానానికి దాదాపు పది మంది పోటీపడడం ఆశావహుల జాబితా ఎంత ఎక్కువ ఉందో అర్దం చేసుకోవచ్చు. మరి ఇంతటి ఒత్తిడితో జగన్ ఈ అంశాన్ని ఎలా డీల్ చేస్తారో అని పార్టీలో అంతర్గత చర్చ నడుస్తోంది.
ఆశావాహల జాబితాలో ఎవరెవరు ఉన్నారంటే..
జగన్ పాదయాత్ర, సీట్ల కేటాయింపులు, ఎన్నికల అనంతరం శాసనసభలో చేరికల సందర్భంలోనూ జగన్ చాలామందికి ఎమ్మెల్సీని చేస్తాననే హామీ ఇచ్చారు. రాజకీయ పార్టీలో ఇటువంటి హామీలు సాధారణమే. అయితే.. ఈ సమయంలో ఎమ్మెల్సీ పదవి కోసం ఎందరో పోటీ పడుతున్నారు. ఖాళీ అయిన స్థానం బీసీ సామాజిక వర్గానికి చెందినది కావడంతో అదే సామాజిక వర్గం చెందిన వారికి జగన్ అవకాశమిస్తారని అందరూ భావిస్తున్నారు. చేతి వృత్తుల వారికి చెందిన కొంతమంది ప్రయత్నాలు ఇప్పటికే మొదలుపెట్టారని ఇప్పటికే పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. మోపిదేవి మత్స్యకార సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో అదే సామాజిక వర్గం నుంచి ఇద్దరు పోటీ పడుతున్నట్టు తెలుస్తోంది.
చేనేత వర్గానికి చెందిన ఇద్దరు, ఉత్తరాంధ్రకు చెందిన మరో బీసీ నేత తమ ప్రయత్నాలు ప్రారంభించారని పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరోవైపు గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో అసెంబ్లీ స్థానం వదులుకున్న మర్రి రాజశేఖర్, తూర్పు గోదావరి జిల్లాకు చెందిన తోట త్రిమూర్తులు ఆశావహుల జాబితాలో ఉన్నారు. అయితే.. ఈ స్థానం బీసీ వర్గాలకే చెందుతుందని భావిస్తున్నారు. మరో ఎమ్మెల్సీ పిల్లి సుభాస్ చంద్రబోస్ స్థానం కూడా ఖాళీ అయినా.. ఆరు నెలల గడువు మాత్రమే ఉండటంతో దీనికి ఎన్నిక నిర్వహించే అవకాశాలు లేవని ఎన్నికల సంఘం ద్వారా తెలుస్తోంది.