తూర్పుగోదావరి(సామర్లకోట), జనవరి 24: సినీనటి భానుప్రియపై తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట పోలీసు స్టేషన్లో ఫిర్యాదు అందింది. తన ఇంట్లో పనిమనిషిగా ఉన్న 14 ఏళ్ల సంధ్యను భానుప్రియ వేధిస్తున్నరంటూ ఆ పాప తల్లి ఫిర్యాదు చేశారు. సామర్లకోట మండలం తండ్రవాడకు చెందిన పద్మావతి తన కుమార్తెను ఏడాదిన్నర క్రితం ఇంటి పనులకోసం చెన్నైలోని భానుప్రియకు అప్పగించారు.
తన కూతురిని ఇంటికి పంపించమంటే దొంగతనం నెపం మోపి, 10లక్షలు కట్టి తీసుకువెళ్లాలని బెదిరించారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. నా కూతురు తిరిగి ఇంటికి వచ్చే విధంగా సహాయం చేయాలని ఆమె గురువారం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో కోరారు.
ఇంట్లో పద్మావతి కుమార్తె దొంగతనం చేసిందనీ, దాని గురించి ప్రశ్నిస్తే ఎదురు కేసు పెట్టారనీ సినీనటి భానుప్రియ ఆరోపించారు. తనపై కేసు నమోదు అయ్యిందన్న వార్తలతో ఆమె మీడియా ముందుకు వచ్చారు. తన ఇంట్లో పనిమనిషిగా చేరిన అమ్మాయి పలుమార్లు దొంగతనానికి పాల్పడినట్లు ఆమె ఆరోపించారు. అమ్మాయిని నిలదీయడంతో నేరం అంగీకరించిందని ఆమె చెప్పారు. దొంగిలించిన వస్తువులను పద్మావతి తిరిగి తీసుకువచ్చిందని ఆమె తెలిపారు. సుమారు లక్షా యాభైవేల వరకు నగదు మాయం అయిందనీ, దాని గురించి ప్రశ్నించినందుకు కేసు పెట్టారని ఆమె చెప్పారు. కూతుర్ని ఇంటికి తీసుకువెళ్ళమని ఫోన్ చేసి చెప్పామని ఆమె తెలిపారు.