ఆంధ్రప్రదేశ్లో దిగ్విజయంగా అమలవుతున్న ఒక వ్యవస్థను తెలంగాణలో కూడా ప్రవేశపెట్టబోతున్నారని సమాచారం.కాకుంటే పేర్లే తేడా! వివరాల్లోకి వెళితే ఏపీలో విజయవంతమైన వాలంటీర్ల వ్యవస్థను తెలంగాణలోనూ అమలు చేసే యోచనలో టీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకెళుతోంది.
కొద్దిపాటి మార్పులతో అలాంటి వ్యవస్థలనే తెలంగాణలోని పట్టణాల్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతానికి ఈ వ్యవస్థను తెలంగాణలోని పట్టణాల్లో ప్రవేశపెట్టనున్నట్లు మంత్రి కెటిఆర్ ప్రకటించేశారు కూడా .ప్రతి పట్టణంలో వార్డుకు ఓ అధికారిని నియమించనున్నట్టు ఆయన తెలిపారు.పారిశుద్ధ్యం, హరితహారం సహా ఇతర కార్యక్రమాలు సమర్థంగా అమలు చేయడం కోసం వారిని నియమించనున్నట్టు తెలిపారు. ఇలా వార్డుకో అధికారిని నియమించడం దేశంలోనే తొలిసారి అని పేర్కొన్నారు. ఈ ఒక్క కెసిఆర్ స్టేట్మెంటే ఆంధ్రప్రదేశ్లోని వైసిపి వారికి నచ్చడం లేదు.ఎందుకంటే ప్రస్తుతం వాలంటీర్ల వ్యవస్థ ఆంధ్రప్రదేశ్లో అమలవుతోంది ఇక్కడ రెండు రకాలు అనగా గ్రామ వాలంటీర్లు వార్డు వాలంటీర్లుగా వారి సేవలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉపయోగించుకుంటోంది.
ఏపీలో వాలంటీర్లను నియమించడం ద్వారా ప్రభుత్వ పథకాల అమలును వారి చేత జరిపించాలని సీఎం జగన్ నిర్ణయించారు. ప్రతి 50 ఇళ్లకు ఓ వాలంటీర్ ను నియమించి, వారికి సంబంధించిన అన్ని వివరాలూ ప్రభుత్వం సేకరించింది. పథకాల అమల్లోనే కాకుండా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలోనూ వారి సేవలను సర్కారు వినియోగించుకుంది. దేశంలోని ఒకటి రెండు రాష్ట్రాలు సైతం ఈ వ్యవస్థపై మక్కువ చూపించాయి.తాజాగా ఆ బాటలోకి తెలంగాణ వచ్చింది. అయితే, నేరుగా అలాంటి వ్యవస్థే కాకుండా కొన్ని మార్పులు చేసి వార్డు ఆఫీసర్ల నియామకానికి శ్రీకారం చుట్టింది. వార్డుకో అధికారిని నియమించడం ద్వారా ఆ వార్డులోని సమస్త సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకునే వీలుంది.
ప్రభుత్వ పథకాలు అందించడంలోనూ, లోటుపాట్లను తెలుసుకోవడంలోనూ వీరు అక్కరకొస్తారు. ఇక పార్టీపరంగా కూడా వీరిని అనధికారికంగా వినియోగించుకునే అవకాశం ఉంది.తెలంగాణ ప్రభుత్వం దీని పేరు మార్చి పట్టణాల్లో వార్డు అధికారులుగా ఈ వ్యవస్థనే ప్రవేశపెట్టబోతోంది.ఇంకా దాపరికం ఏమిటి కేటీఆర్ ?మంచి పథకం కాబట్టి మేమూ ఆచరిస్తున్నాం అని ఒప్పుకోవచ్చు కదా అని వైసీపీ వర్గాలు అడుగుతున్నాయి . ఏదేమైనా సినిమాల్లోనే కాదు రాజకీయాల్లో కూడా కాపీలు, అనుసరణలు, ఇన్స్పిరేషన్లు ఉంటాయన్నమాట!