రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించిన అనంతరం కాంగ్రెస్ లో గెహ్లాట్, సచిన్ పైలట్ మధ్య ఆధిపత్య పోరు పెరిగింది. ఇరువురూ కూడా సీఎం పదవి కోసం పోటీపడుతున్న నేపథ్యంలో వారి పంచాయతీ రాహుల్ వద్దకు చేరింది. సీఎల్పీ నేత ఎన్నిక విషయంలో పార్టీ శాసనసభ్యుల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో అధిష్టానం రంగంలోనికి దిగింది. ఈ నేపథ్యంలో గెహ్లాట్, పైలట్ ను నేడు రాహుల్ గాంధీతో భేటీ కానుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇరువురి మధ్యా రాజీ కుదిర్చే విషయంలో కాంగ్రెస్ అధిష్టానం ఏ మేరకు విజయం సాధిస్తుందన్నది ఈ భేటీ తేల్చేయనుంది. రాష్ట్రంలో ఇరువురికీ గట్టి పట్టుంది. అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ ను విజయ పథంలో నడిపించడంలో ఇరువురిదీ కూడా ప్రముఖ పాత్ర ఉందనడంలో సందేహం లేదు. ఇలా ఉండగా రాజస్థాన్ సీఎం విషయంలో ఒక రాజీ సూత్రాన్ని రాహుల్ వారి ముందు ఉంచే అవకాశం ఉందని చెబుతున్నారు. రెండున్నరేళ్లు ఒకరు, మిగిలిన రెండున్నరేళ్లు మరొకరు సీఎంగా బాధ్యతలు నిర్వర్తించే విధంగా వారిరువురినీ ఒప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతాయని చెబుతున్నారు. ఏది ఏమైనా కాంగ్రెస్ రాజస్థాన్ లో అధికారం చేపట్టడం ఖాయమైపోయిన తరువాత కూడా సీఎం ఎవరన్న విషయంలో సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది.
previous post
next post