Congress: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. పార్టీ హైకమాండ్ నుండి ఆహ్వానం రావడంతో ఆయన ఢిల్లీకి వెళుతున్నట్లు తెలుస్తొంది. దేశంలో పార్టీ బలోపేతానికి కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు పాదయాత్రలు నిర్వహించాలని ఇప్పటికే ఆ పార్టీ నిర్ణయించిన సంగతి తెలిసిందే. కిరణ్ కుమార్ రెడ్డికి అధిష్టానం నుండి ఆకస్మికంగా పిలుపు రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. పార్టీ అధిష్టానం పిలుపు మేరకు ఢిల్లీ వెళుతున్న కిరణ్ కుమార్ రెడ్డి రెండు రోజుల పాటు ఢిల్లీలో గడపనున్నారు. పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు పార్టీలోని పలువురు పెద్దలను కిరణ్ కుమార్ రెడ్డి కలవనున్నట్లు సమాచారం.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
Congress: విభజన తర్వాత పార్టీకి దూరంగా..
ఏపిలో పార్టీ పూర్వవైభవానికి తీసుకోవాల్సిన చర్యలపై కిరణ్ కుమార్ రెడ్డితో పార్టీ పెద్దలు చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తొంది. కిరణ్ కుమార్ రెడ్డి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్ర విభజన జరిగింది. రాష్ట్ర విభజన తరువాత కిరణ్ కుమార్ రెడ్డి క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. కాంగ్రెస్ పార్టీలోని మెజార్టీ నేతలు జగన్మోహనరెడ్డి నేతృత్వంలోని వైసీపీలో చేరిపోయారు. పార్టీ క్యాడర్ మొత్తం వైసీపీకి మళ్లింది. దీంతో 2014, 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బోణీ కొట్టలేకపోయింది. ప్రస్తుతం రాష్ట్రంలో అధికార వైసీపీ చాలా బలంగా ఉంది. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టేందుకు కిరణ్ కుమార్ రెడ్డి అంగీకరిస్తారా లేదా అన్నది వేచి చూడాలి.